ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న హమాస్ దాడులు,,,భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:32 PM

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య మరోసారి భీకర పోరు సాగుతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. శనివారం ఉదయం కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి అలర్ట్ చేసింది. గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రకటన చేసింది. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌ సైనం పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ భూభాగంలోకి భారీగా ఆయుధాలతో చొరబడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన పౌరుల్ని కాల్చి పడేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం వేళ భారత ప్రభుత్వం.. అక్కడ ఉన్న మన దేశ పౌరులకు కీలక సూచనలు చే సింది.


ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడి అధికారులు జారీ చేసిన ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని చెప్పింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాడులు జరుగుతున్నందున ప్రతీ ఒక్కరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పేర్కొంది. అవసరమైతే దగ్గరలో ఉన్న బాంబ్ షెల్టర్ల‌ు, బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. భారత రాయబార అధికారులతో అక్కడి భారతీయులు నిత్యం కమ్యూనికేషన్‌లో ఉండాలని పేర్కొంది. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఈ మెయిల్‌లో సంప్రదించాలని ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ అధికారులు కోరారు.


ఇక హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులతోపాటు పదుల సంఖ్యలో పౌరులను బంధీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నలుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్టులను ఇజ్రాయెల్ మూసివేయించింది. హమాస్ దాడులకు ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ సైన్యం.. గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై దాడులు జరిపింది. ప్రత్యర్థుల రాకెట్లు కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది.


ఇజ్రాయెల్‌పై మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు హమాస్ గ్రూప్‌ చీఫ్‌ మహమ్మద్‌ డీఫ్‌ వెల్లడించారు. ఆపరేషన్ అల్ అక్సా అనే ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్‌ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇజ్రాయెల్‌లోకి హమాస్ ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడుతున్నట్లు వీడియోలు బయటికి వచ్చాయి. అయితే ఎంత మంది ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించారనేది స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa