ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను మళ్లీ సీఎం అవుతానా.. ఎన్నికల సభలో ప్రజలను అడిగిన శివరాజ్ సింగ్ చౌహాన్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:36 PM

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే హామీలు, మేనిఫేస్టోలు, ప్రజాకర్షక పథకాలతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే నేతలు కొత్త కొత్త పద్దతుల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తాజాగా ఓ బహిరంగ సభలో.. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా అంటూ ప్రజలను ప్రశ్నించారు.


మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో శుక్రవారం ఓ భారీ బహిరంగ సభలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. అయితే తన పాలన గురించి ప్రజలను ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు వేశారు. తాను మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నానా లేక చెడు ప్రభుత్వాన్ని నడుపుతున్నానా అని మిమ్మల్ని అడగాలి అను ఉందని ప్రజలతో అన్నారు. కాబట్టి తన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలా వద్దా అని ప్రశ్నించారు. తాను మరోసారి ముఖ్యమంత్రిని అవుతానా అని అడిగారు. దీంతోపాటు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ బహిరంగ సభకు వచ్చిన వారిని అడిగారు. అయితే ఈ రెండు ప్రశ్నలకు అక్కడికి వచ్చిన ప్రజల నుంచి సానుకూల సమాధానాలు వచ్చాయి.


అయితే గురువారం ధార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. శివరాజ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారని తెలిపారు. కేవలం తనను చూసి ఓటు వేయాలని ప్రధాని మోదీ ప్రజలను అడుగుతున్నారు. అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక సీఎంగా ఉండరని ప్రియాంక పేర్కొన్నారు. అయితే మధ్యప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇటీవలి కాలంలో జరిగిన సభలు, ఎన్నికల ర్యాలీల్లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత నియోజకవర్గం బుద్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ప్రజలను అడిగారు.


అంతకుముందు ఖర్గోన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తనకు ఏ పదవిపైనా ఆశ లేదని.. తాను ప్రజలకు మంచి చేస్తేనే సంతోషంగా ఉంటానని పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకు తమ పార్టీలో అందరూ సోదరభావంతో మెలుగుతామని చెప్పారు. అది ప్రజల నిర్ణయమే అని స్పష్టం చేశారు. ఇక 230 మంది స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరిగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే 79 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ జాబితా ప్రకటించింది. ఇందులో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఉన్నారు. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి కైలాష్ విజయవర్గియా ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా కనిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa