ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఫైబర్ నెట్ కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి మరో మాజీ మంత్రి పేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 07:55 PM

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడి పేరు కూడా బయటకు వస్తుందన్నారు ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి. లోకేష్‌ పాత్ర ఉందా లేదా అనేది సీఐడీ చెబుతుందని.. దర్యాప్తులో తేలుతుంది అన్నారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పానని.. ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని.. తనను కూడా జైలుకు పంపించారన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్‌ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు.


ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు చెప్పే చంద్రబాబుని ప్రభుత్వం అరెస్టు చేసిందనడం సరికాదన్నారు గౌతమ్ రెడ్డి. బీజేపీ, వైఎస్సార్‌సీపీల మధ్య ఎలాంటి సంబంధాలూ లేవన్నారు. రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌ వ్యాపార విస్తృతికి కొత్తగా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా టెలికాం ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లలో పాల్గొనాలని నిర్ణయించామన్నారు. రూ.1,145.10 కోట్ల సీసీ కెమెరాల ప్రాజెక్టుని ప్రభుత్వం నుంచి తీసుకుని రాష్ట్ర హోంశాఖకు లీజుకి ఇస్తున్నామన్నారు. ఫైబర్‌ నెట్ కంపెనీకి ప్రస్తుతం ఉన్న రూ.7 కోట్ల షేర్లును రూ.2 వేల కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్ రెడ్డి తెలిపారు.


కంపెనీకి రూ.3,586 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. సంస్థ వ్యాపారాభివృద్ధికి వీలుగా హడ్కో నుంచి ఇప్పటికే రూ.150 కోట్ల రుణం తీసుకున్నామన్నారు. మరో రూ.150 కోట్లు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్‌ఈసీ నుంచి రూ.300 కోట్ల రుణం కోసం సంప్రదింపులు చేస్తున్నామన్నారు. కొత్తగా కేబుల్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన బాక్సులను సంస్థ ద్వారా ఆపరేటర్లు, ఎంఎస్‌వోలకు మొదటి తొమ్మిది నెలల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవసరమైతే మరో మూడు నెలలు పొడిగిస్తామన్నారు. ఒక్కో బాక్సు విలువ ప్రైవేట్‌ మార్కెట్లో రూ.4 వేల వరకు ఉంటుందని.. ఆపరేటర్లకు భారమవకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అకౌంట్లను ఇంటర్నల్‌/ఎక్స్‌టర్నల్‌ ఆడిటింగ్‌ తర్వాత కాగ్‌కు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబుపైనా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మాజీ మంత్రి యనమల పేరు కూడా తెరపైకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa