ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు నెల రోజుల వెకెషన్‌కు వచ్చిన ఎన్ఆర్ఐ,,,ఆహారంలో విషం కలిపిన భార్య, ఆమె రహస్య ప్రియుడు

Crime |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 11:02 PM

ఉత్తర్ ప్రదేశ్‌లో ఏడేళ్ల కిందట జరిగిన ఎన్‌ఆర్ఐ హత్య కేసులో ఆయన భార్యే దోషిగా తేలింది. తన రహస్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన బ్రిటిష్ మహిళను యూపీ కోర్టు దోషిగా నిర్దారించింది. ఈ కేసులో వారి తొమ్మిదేళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. 2016 సెప్టెంబరు 2న ఎన్‌ఆర్ఐ సుఖ్‌జీత్ సింగ్ హత్యకు గురయ్యారు. యూపీలోని షాజహాన్‌పూర్‌కి చెందిన సుఖజీత్ సింగ్.. యూకే నుంచి తన భార్య రమణ్‌దీప్ కౌర్ మాన్, ఇద్దరు పిల్లలతో కలిసి నెల రోజులు పర్యటన కోసం భారత్‌కు వచ్చాడు.


మార్గమధ్యలో రమణ్‌దీప్ కౌర్.. తన చిన్ననాటి స్నేహితుడు పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన గుర్‌ప్రీత్‌ను కలిసింది. భర్త, పిల్లలు సహా కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. షాజహాన్‌పూర్‌కు వచ్చిన తర్వాత.. వారు తినే ఆహారంలో విషం కలిపారు. అనంతరం సుఖ్‌జిత్ సింగ్‌ను గొంతు కోసి హత్య చేశారు. కానీ, వారి తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడు విషం కలిపిన ఆహారం తినకుండా మ్యాగీ కావాలని పట్టుబట్టడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు రాత్రి ప్రియుడితో కలిసి తన తండ్రిని తల్లి చంపడం అతడు కళ్లారా చూశాడు. ఈ కేసులో అ బాలుడ్ని ప్రత్యక్ష సాక్షిగా కోర్టు పరిగణించింది.


‘మా నాన్న చాలా గొప్పవాడు.. కానీ మా అమ్మ చెడ్డది.. ఆమె నా కళ్ల ముందే మా నాన్నను చంపింది.. నేను ఆమె ముఖాన్ని చూడాలనుకోవడంలేదు.. ఆమె మా నాన్న ముఖంపై ఒక దిండుతో అదిమిపట్టి.. గురుప్రీత్‌ని గొంతు కోయమని చెప్పింది’ అని బాలుడు ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం రమణ్‌దీప్ కౌర్, ఆమె ప్రియుడు గురుప్రీత్‌లను దోషులుగా కోర్టు నిర్దారించింది. అక్టోబరు 7న వీరికి శిక్ష ఖరారు చేయనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ కుమార్ ఖన్నా చెప్పారు. ‘ఆయుధ చట్టంలోని సెక్షన్ 4/25 కింద కూడా గుప్రీత్‌ను దోషిగా నిర్ధారించారు. తన తొమ్మిదేళ్ల కుమారుడి ఎదుటే తండ్రి గొంతు కోసి చంపిన అరుదైన ఘటన ఇది. నిందితులను అరెస్ట్ చేసి గురువారం షాజహాన్‌పూర్ జైలుకు తరలించారు.. వారికి ఉరిశిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.


నిందితుడు గుర్‌ప్రీత్ పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరిస్తూ.. తాను, రమణదీప్ డబ్బులు ఖర్చుపెట్టి ఆధారాల్లేకుండా తప్పించుకుంటామని భావించి హత్యకు ప్లాన్ చేశామని చెప్పాడు. ఇక, సుఖ్‌జీత్ తల్లి మాట్లాడుతూ.. ‘నా కొడుకు కోసం పోరాడటానికి నేను ఇక్కడకు వచ్చాను.. మహమ్మారి సమయంలో కూడా నేను బలంగా నిలబడ్డాను.. నా కొడుకుకు అన్యాయం జరిగింది. అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa