2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని.. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామన్నారు. రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. ఏపీ వ్యాప్తంగా 8వేల మందికి పైగా హాజరైన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన వారంతా తనకు కుటుంబ సభ్యులే అన్నారు.
పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలి స్థాయి, ఆపై ఎన్నికైన వారందరికీ ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నానన్నారు. ఇక్కడ ఈ సమావేశానికి రాలేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న ఎంపీటీసులు, సర్పంచ్లు, తదితరులందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అధికారాన్నిప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నామని.. ప్రజలకు సేవకుడిగా సేవలందించాం కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు తీసుకొచ్చామన్నారు.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని.. స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి న్యాయం చేశామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని.. 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని.. వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చామన్నారు.
ప్రజలకు మరింత మంచి చేయడానికి మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఏపీకి జగనే ఎందుకు కోవాలో చెప్పేందుకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లేందుకు టార్గెట్గా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు.ప్రజలందరి ఆశీస్సులతో మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు బస్సు యాత్రల్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇది బస్సుయాత్రే కాదు.. సామాజిక న్యాయయాత్ర అన్నారు. పేదవారికి జరిగిన మంచిని గురించి వివరించే యాత్ర అన్నారు. రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు జరగబోయే యుద్ధమని.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం పూరించిందనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa