ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వర్షాలు బదులు వేసవికాలాన్ని తలపిస్తూ ఎండలు తీవ్రత కనిపిస్తోంది. అక్కడక్కడా తేలికపాటి వానలు పడినా పెద్దగా వాతావరనం చల్లబడటం లేదు. మళ్లీ వర్షాల కోసం జనాలు, రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతన్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వానలు పడతాయని అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకింత అధిక వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతాయంటున్నారు.
ఐఎండీ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయంటున్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగాను వానలు పడతాయని భావిస్తున్నారు. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిస్తే కుండపోత వర్షాలకు అవకాశం ఉందని.. అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. నవంబర్లో మాత్రం విస్తారంగా కురవనున్నాయి అంటున్నారు.
ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ఇవి అక్టోబర్ 18–22ల మధ్య ప్రవేశిస్తాయి. ఈసారి కూడా ఈ సమయంలోనే ప్రవేశిస్తాయి అంటున్నారు. సిక్కిం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర పరిసరాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. గాలిలో తేమ తగ్గి పొడి గాలులు ఏర్పడితే ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఉంటాయంటున్నారు. నైరుతి రుతుపవనాలతో ఈసారి సాధారణ వర్షపాతమే నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే రికార్డయింది. ఇవాళ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa