ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మద్యం విక్రయాలపై రగడ,,,,సీబీఐతో విచారణ చేయాలని అమిత్ షాకు పురందేశ్వరి ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 08:40 PM

ఏపీలో మద్యం విక్రయాలపై బీజేపీ కొంతకాలంగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ పార్టీ చీఫ్ పురందేశ్వరి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం వ్యాపారంలో ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని.. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తిచేశారు. ఆమె కేంద్ర హోంమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఏటా సగటున రూ.57,600 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.32 వేల కోట్ల ఆదాయం మాత్రమే చూపుతోంది అన్నారు. దీని ప్రకారం కనిష్ఠంగా సగటున ఏటా రూ.25 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. హోంమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ప్రస్తావించారు. ఇటీవల తాను స్వయంగా మద్యం దుకాణాన్ని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ షాపులో రూ.లక్ష విలువైన అమ్మకాలు చేయగా అందులో రూ.700 మినహా మిగిలినదంతా నగదు రూపంలోనే ఉందని.. ఆంధ్రప్రదేశ్‌లో రోజూ 80 లక్షలమంది మద్యం తాగుతున్నారన్నది సగటు కనీస లెక్కగా చెప్పారు. వీరు ప్రతిరోజూ రూ.200 మేర మద్యం కొనుగోలు చేసినట్లు భావించినా సగటున సంవత్సరానికి రూ.57,600 కోట్ల (రూ.4800 కోట్ల్లు12నెలలు) వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వార్షిక ఆదాయం రూ.32 వేల కోట్లుగానే చూపుతోంది అన్నారు. దీన్నిబట్టి ఏటా కనీసం రూ.25వేల కోట్ల దోపిడీ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది అన్నారు.


ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ కూడా కొన్ని కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేస్తోందన్నారు పురందేశ్వరి. ఇలా చేసిన అక్రమ ఆదాయం రాష్ట్రంలో ఉన్నతస్థాయిలో కూర్చున్నవారికి నేరుగా చేరుతున్నట్లు తెలుస్తోంది అన్నారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యంపై వసూలు చేస్తున్న స్పెషల్‌ డ్యూటీ రాష్ట్ర ఖజానాకు చేరడంలేదని.. ఇదంతా ఎక్కడికిపోతోందన్నది క్లారిటీ లేదన్నారు. అంతేకాదు ఏపీలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి, అతని అనుచరుల జేబులు నింపడానికి రూ.వేల కోట్లు దారిమళ్లిస్తున్నారన్నారు. లిక్కర్ షాపుల్ని గతంలో టెండర్‌ ద్వారా అప్పగించేవారని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తోందన్నారు. మద్యం తయారీ విధానం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉందన్నారు. లీటర్‌ మద్యం తయారీకి రూ.15 ఖర్చయితే.. దాన్ని రూ.600 నుంచి రూ.800కి విక్రయిస్తున్నారన్నారు. పైగా 80% విక్రయాలను నగదు రూపంలోనే చేస్తున్నారన్నారు. ఈ మద్యం తాగి పేదలు ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయన్నారు. ఇన్ని పేద కుటుంబాలు అతలాకుతలం కావడానికి ఏపీ ముఖ్యమంత్రి, అనుచరులుప్రధాన కారణమన్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ఉన్న హానికారక పదార్థాలకు సంబంధించిన నివేదికనూ ఈ వినతిపత్రంతోపాటు అందించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు పురందేశ్వరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa