ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో లైను నిర్మాణ పనులకు,,,,త్వరలోనే రూ.2,853.23 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 08:47 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. గుంటూరు - నడికుడి - సికింద్రాబాద్‌ రైలు మార్గంలో బీబీనగర్‌, గుంటూరు మధ్య (239 కి.మీ.) రెండో లైను నిర్మాణ పనులకు కసరత్తు మొదలైంది. కేంద్ర కేబినెట్‌ వ్యవహారాల కమిటీ డబ్లింగ్‌కు ఆమోదం తెలపడంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రైల్వేబోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ.2,853.23 కోట్లు కాగా.. అందులో సివిల్‌ పనులకు రూ.1,947.44 కోట్లు, సిగ్నలింగ్‌, టెలికాం పనులకు రూ.319.62 కోట్లు కేటాయించారు. అలాగే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ నిర్మాణ పనులకు రూ.586.17 కోట్ల మొత్తాన్ని అంచనా వ్యయాలుగా నిర్ణయించారు. త్వరలోనే నిర్మాణ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానున్నాయి.


ఈ రెండో లైను కనుక అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాలతో పాటుగా చెన్నైకు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ - విజయవాడ మధ్య రెండు రైల్వే మార్గాలున్నాయి. ఇందులో కాజీపేట, ఖమ్మం మార్ మధ్య దూరం 350 కిలోమీటర్లు.. మరో మార్గమైన బీబీనగర్‌- నడికుడి- గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336 కి.మీ మాత్రమే. అప్పుడు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నైలకు వయా విజయవాడతో పోలిస్తే.. నడికుడి, గుంటూరు మార్గంలో దాదాపు 46 కి.మీ. దూరం తక్కువ ఉంటుంది అంటున్నారు.


గుంటూరు రూట్‌లో రద్దీ పెరగగా.. సింగిల్‌ ట్రాక్‌ కావడంతో.. ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్‌లో ఆపాల్సిన పరిస్థితి ఉంది. అదే కనుక రెండో లైను నిర్మిస్తే ప్రస్తుత రైళ్ల వేగం పెరుగుతుందని.. అదనపు రైళ్లు నడిపించడానికి అవకాశం ఉంటుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. బీబీనగర్‌-గుంటూరు మార్గంలో 100 కి.మీ. రైల్వే ట్రాక్‌ ఏపీ పరిధిలో.. 139 కి.మీ. రైల్వే ట్రాక్‌ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్‌ లైను గరిష్ఠ వేగం సామర్థ్యం 130 కి.మీ. మాత్రమే కాగా.. వందేభారత్‌ రైలు సామర్థ్యం 160 కి.మీ.గా ఉంది. దీంతో రెండోలైన్‌ను 150-160 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించే అవకాశం ఉంది అంటున్నారు.


ఈ ప్రాజెక్టును వాస్తవానికి 2019-20 కేంద్ర బడ్జెట్‌ రైల్వే పింక్‌బుక్‌లో చూపించారు. అప్పట్లో అంచనా వ్యయాన్ని రూ.2,480 కోట్లుగా పేర్కొనగా.. ప్రాజెక్టును ఆలస్యం చేయడంతో.. ఇప్పుడు అంచనా వ్యయం రూ.2,853.23 కోట్లకు చేరింది. అంటే రూ.373 కోట్లు పెరిగింది. ఈ రెండో లైన్‌ నిర్మాణంతో ప్రయాణికులతో పాటు రవాణా కూడా వేగవంతమవుతుంది అంటున్నారు. అంతకాదు ఈ రూట్‌లో విష్ణుపురం, నడికుడి, జాన్‌పహాడ్‌, మేళ్లచెరువు, జగ్గయ్యపేట, రామాపురంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంతేకాదు ‌చిట్యాల, నార్కట్‌పల్లిలో ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమలు ఉండగా.. విష్ణుపురంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా నిర్మాణం అవుతోంది. అలాగే మిర్యాలగూడ, నల్గొండ, నాగిరెడ్డిపల్లిలో ఎఫ్‌సీఐ గోడౌన్‌లు ఉన్నాయి. రెండో రైల్వే లైను నిర్మాణం వీటన్నింటికీ మరింత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఈ పనుల్ని త్వరగా చేపట్టి పూర్తి చేస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa