ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టిన బిడ్డను అమ్మేసిన ప్రబుద్ధుడు.. పోలీసుల చొరవతో అమ్మ ఒడికి పసికందు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 07:04 PM

ఆమె పేరు వరలక్ష్మీ, కొంత కాలం క్రితం పెళ్లయ్యింది. కానీ భర్త వదిలేయడంతో.. ఓ ప్రయివేట్ బ్యాంకులో స్వీపర్‌గా పని చేసేది. ఆమెకు కొత్తపల్లి రాము అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వంట మేస్త్రీగా పని చేసే అతడికి కూడా ఇంతకు ముందే పెళ్లయ్యినప్పటికీ.. భార్య వదిలేసింది. వరలక్ష్మీ, రాము మధ్య పరిచయం కాస్తా.. సహజీవనానికి దారి తీసింది. గత మూడేళ్లుగా వీరిద్దరూ అమలాపురంలో కలిసి ఉంటున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన వరలక్ష్మీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాముకు కొందరు డబ్బు ఆశజూపి చంటి పాపను విక్రయించాలని సూచించారు. దీంతో మరో ఐదుగురితో కలిసి రాము.. వరలక్ష్మీని ప్రలోభపెట్టి.. బెదిరించి బిడ్డను అమ్మేందుకు ఒప్పించాడు. అక్టోబర్ నాలుగో తేదీన కాకినాడకు తీసుకెళ్లి విక్రయించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి చెందిన ఓ జంట ఆ చంటి బిడ్డను కొనుగోలు చేసింది.


పసికందును విక్రయించగా రూ.3.2 లక్షలు రాగా.. వరలక్ష్మీకి రూ.1.20 లక్షలు ఇచ్చారు. అందులో నుంచి రూ.20 వేలను రాము తన అవసరాలకు వాడుకున్నాడు. బిడ్డ గుర్తుకు వచ్చిందో లేదా మరో కారణమో తెలీదు గానీ.. అక్టోబర్ 8న వరలక్ష్మీ అమలాపురం టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ ఆదేశాలతో.. అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ నేతృత్వంలో విచారణ జరిపి.. ఈ కేసులో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.


చట్ట ప్రకారం దత్తత చేయిస్తామని నమ్మించి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి చెందిన జంటకు బిడ్డను అమ్మినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు వారి దగ్గర్నుంచి చంటి బిడ్డను తిరిగి తల్లికి అప్పగించారు. వరలక్ష్మీ ఫిర్యాదు చేసిన మరుసటి రోజు సాయంత్రమే పోలీసులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. మరుసటి రోజే వారిని అమలాపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ముద్దాయిలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa