ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే చీదర వేస్తుందని, కొందరు నాయకుల వ్యవహారం చూసి సిగ్గు పడాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో శుక్రవారం జరిగిన డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదాశివరావు జీవిత విశేషాలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. మనం ఏం చేయలేం అనుకోవద్దని, అందరూ కలిసి చెడును కడిగేయాలని పిలుపునిచ్చారు.
గొప్పవారిని చట్టసభలకు ఎన్నుకోవాలని సూచించారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని మాజీ రాష్ట్రపతి చెప్పారు. సదాశివరావు లాంటి వైద్యులు ప్రజాసేవ కోసమే వైద్య వృత్తిలో కొనసాగారని, రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రవేశారన్నారు. రాజకీయ నేతగా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. వైద్య, కళా, రాజకీయ రంగాలకు కాసరనేని చేసిన సేవల్ని కొనియాడారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన కాసరనేని జీవితం అందరికీ స్ఫూర్తి అన్నారు.
ఇప్పుడు హాస్పిటల్లో ఫీజులు మాత్రమే పరమావధిగా వైద్యం చేస్తున్నారని అన్న అపవాదు ఉందని, దాని నుంచి వైద్య రంగం బయట పడాలని సూచించారు. కులం, డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని మండిపడ్డారు. కులం, మతం, నేర మనస్తత్వం, డబ్బు ఎక్కువ కావడ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు.
చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడుకోరాదని హితవు పలికారు. కులం చూసి కాదు గుణం చూసి ఓటు వేయాలని వెంకయ్య అన్నారు. అనంతరం వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి సేవ పురస్కారాలను వెంకయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa