ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరిరామజోగయ్య పిటిషన్,,,,కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 08:51 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిల్‌లో అఫిడవిట్‌ను సవరించాలని హరిరామ జోగయ్యకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో జగన్‌ కేసుల స్థాయి వివరాలతో పాటు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించాలంటూ రెండు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ పిల్‌పై రిజిస్ట్రీ అభ్యంతరాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది ధర్మాసనం.


జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలంటూ హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిల్ దాఖలు చేశారు.. సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో నిందితుడైన జగన్‌ వరుస పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేస్తున్నారన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యారని పిల్‌లో ప్రస్తావించారు.


అయితే ఈ పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తంచేయడంతో ధర్మాసనం విచారణ చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై ప్రధానంగా విచారణ జరగ్గా.. గత ఆదేశాల మేరకు కేసు విచారణలో జాప్యానికి సంబంధించిన పత్రాలను జతచేసినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఆ డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. డాక్యుమెంట్లకు అనుగుణంగా కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


మరోవైపు జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి వై.ఎస్‌.జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, వాళ్ల కంపెనీల ఆస్తుల జప్తు ఉత్తర్వులను సవరిస్తూ ఢిల్లీలోని అప్పీలేట్‌ అథారిటీ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో ఈడీ అప్పీలు దాఖలు చేసింది. ఈడీతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన కంపెనీలు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు డిసెంబరు 11కు వాయిదా వేసింది. వాన్‌పిక్‌ కేసులో ఆస్తుల జప్తు చెల్లదని అప్పీలేట్‌ అథారిటీ ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ చేసింది. వాన్‌పిక్‌ ప్రాజెక్టు ఆస్తుల జప్తు చెల్లదంటూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని ఈడీ తరఫు లాయర్ తెలిపారు.


ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను నవంబరుకు వాయిదా వేసిందన్నారు. అందుకే విచారణను వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం అనుమతించింది. విచారణను డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. ఈలోపు సుప్రీం కోర్టులో కేసు తేలితే.. ఆ విషయాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తే విచారణ చేపడతామన్నారు. మరోవైపు సీఎం జగన్‌పై కోడి కత్తి దాడి కేసుపై విచారణ కూడా 8 నెలల పాటూ ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa