ఏపీ హైకోర్టు రోస్టర్లో మార్పులు జరిగాయి. న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల కొత్తగా నలుగురు జడ్జిల రాకతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ ఆదేశాలతో రిజిస్ట్రార్ రోస్టర్లో మార్పులు చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని బెయిలు పిటిషన్లు, 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు. చంద్రబాబు దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన బెయిలు పిటిషన్, మధ్యంతర బెయిలు కోసం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్ద సోమవారం విచారణ జాబితాలోకి వచ్చాయి.
జస్టిస్ బీఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఎఫ్ఐఆర్/ఛార్జిషీట్ల క్వాష్ పిటిషన్లను అప్పగించారు. ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ 2022 నుంచి దాఖలైన పిటిషన్లపై ఆమె విచారణ చేయనున్నారు. హైకోర్టు జడ్జిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నూనెపల్లి హరినాథ్కు సింగిల్బెంచ్ కేటాయించారు. ఏసీబీ, సీబీఐ కేసుల విషయంలో 2014 వరకు నమోదైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. ఇప్పటివరకు బెయిలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కె సురేష్రెడ్డికి.. ఎఫ్ఐఆర్, అభియోగపత్రాలను కొట్టేయాలంటూ 2017 వరకు దాఖలైన పిటిషన్లను విచారణ చేసే బాధ్యతను అప్పగించారు. 2018 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్ల విచారణను కేటాయించారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ల కొట్టివేత పిటిషన్లపై విచారణ చేసిన జస్టిస్ కె శ్రీనివాసరెడ్డికి.. ఒరిజినల్ సివిల్ దావాలు, ఒరిజినల్ పిటిషన్లు, వాణిజ్య సంబంధ కేసులు, కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, తదితర సబ్జెక్టులను విచారించే బాధ్యతను అప్పగించారు.
తాజాగా జడ్జిలు మరో ముగ్గురు.. సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవీ శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్లో కేసులను విచారణ చేస్తారు. ఇదిలా ఉంటే హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీపై వేరే హైకోర్టులకు వెళుతున్నందున ఈ రోస్టర్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. వారు వెళ్లిన తరువాత తాజా రోస్టర్లో కేటాయించిన సబ్జెక్టులను ఇతర న్యాయమూర్తులకు కేటాయిస్తారు. అలాగే కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి.నరేంద్ర ఇక్కడ ప్రమాణం చేసిన తరువాత ఆయనకు కొన్ని సబ్జెక్టులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తాజా రోస్టర్లో కొద్దిపాటి మార్పులు జరిగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa