ప్రభుత్వ హాస్టల్స్లో వసతులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హాస్టల్స్లో నేలపై నిద్రించే పరిస్థితి వస్తే 'మన పిల్లలను చేరుస్తామా?' అంటూ వ్యాఖ్యానించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని గోడి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని సామాజిక కార్యకర్త బాబ్జి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ధర్మాసనం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను పరిశీలించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.
హాస్టల్స్లో పిల్లలు నిద్రించేందుకు మంచం, పరుపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది. వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు సమయం వచ్చిందని.. గురుకుల పాఠశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం.
గోడి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటుగా.. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బాబ్జీ హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయమూర్తిని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించింది. జిల్లా జడ్జి వసతిగృహంలోని పరిస్థితులపై విచారణ చేపట్టారు. అనంతరం హైకోర్టుకు తన నివేదిక అందించారు.
ఈ నివేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్రావులతో కూడిన ధర్మాసనం.. కీలక ఉత్తర్వులిచ్చింది. వసతిగృహంలో నాలుగు వందల మంది విద్యార్థులకు... కేవలం రెండే టాయిలెట్లు ఉన్నాయని తెలిపింది. బెడ్లు లేక విద్యార్థులు నేల మీదే పడుకుంటున్నారని నివేదికలో ప్రస్తావించినట్లు కోర్టు తెలిపింది. వారికి దుప్పట్లూ ఇవ్వలేదని.. లైట్లు, గదుల్లో తగినన్ని ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు సైతం సక్రమంగా లేవని తేలిందన్నారు. ఒక్క గదిలోనైనా టేబుల్ లేదని.. విద్యార్థుల వస్తువులు, పుస్తకాలు దాచుకునే ట్రంకు పెట్టెలూ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సీఎస్ఆర్ నిధులతో పాటుగా.. ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే నిధులపై ఆధారపడి ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారన్న అంశాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa