ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తూర్పుమధ్య అరేబియా సముద్రంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడింది. దానికి అనుబంధంగా ఉన్న తుఫాన్ ఆవర్తనం తూర్పుమధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 15 తర్వాత వర్షాలు మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నగరిలో 25.2 మిల్లీ మీటర్లు, నెల్లూరులో 14.7, కర్నూలు జిల్లా ఆలూరులో 14.4, కర్నూలు జిల్లా హోలుగుండలో 12.2, తిరుపతిలో 10.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నాలుగు రోజుల క్రితం వరకు ఏపీలో భారీ వర్షాలు కురిశాయి.. ముఖ్యంగా కోస్తాతో పాటూ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో అయితే 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో పంటలు ఎండిపోతున్న సమయంలో రైతులకు కొంత ఉపశమనం దక్కింది. అంతేకాదు ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనాలకు.. వాతావరణం చల్లబడటం ఊరట అని చెప్పాలి. ఈ నెల 15 తర్వాత వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ అంచనాతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa