సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రమోహన్ ఎన్నో సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని.. గొప్ప దర్శకులు, నిర్మాణ సంస్థల సినిమాల్లో ఆయన నటించారన్నారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిదని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.
సీనియర్ నటులు చంద్రమోహన్ మృతి బాధాకరం అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు అన్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలిపారు.
చంద్రమోహన్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన ఆయన 932 చిత్రాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సినీరంగంలో తన నటతో తెలుగువారిని అలరించారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారని.. ఆయన మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒక నటుడిగా, హాస్యనటుడిగా ఎందరినో అలరింపజేసిన చంద్రమోహన్ ఇక లేరు అనే వార్త విని తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే టీడీపీ నేతలు ఆయన మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. చంద్రమోహన్ కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 గంటలకు కన్నుమూశారు. చంద్రమోహన్కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్లో జరగనున్నట్లు కుటుంబ సభ్యుులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa