ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నవరం ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగి మరణం.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దన్న డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 05:37 PM

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగి (స్వీపర్‌) పలివెల సింహాచలం మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు పెద్దాపురం డీఎస్పీ లలితా కుమారి. గత నెల 12న ఉదయం 5 గంటలకు సింహాచలం సహజంగా మరణించలేదని.. నాటుసారా ముఠా కొట్టి చంపిందని.. అధికారులు మాత్రం మూర్చరోగంతో చనిపోయినట్లు నివేదికలు ఇచ్చారంటూ వదంతులు, అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు.


అక్టోబరు 11న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యాడని.. 12వ తేదీ ఉదయం 5 గంటలకు ఇంట్లోనే సింహాచలం చనిపోయినట్లు అదే రోజు ఆయన కుమార్తె నూకరత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోస్ట్‌మార్టమ్‌‌లో సింహాచలం శరీరంపై ఏ విధమైన గాయాలు లేవని.. అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు వైద్యులు నివేదికలో పేర్కొన్నారన్నారు.


సింహాచలం చనిపోయి దాదాపు 30 రోజులైన తర్వాత సహజ మరణం కాదంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇకనైనా ఇటువంటి వదంతులను విడనాడి పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ఎటువంటి ప్రభావాలు పడకుండా చట్టపరంగా దర్యాప్తు ముందుకు వెళ్లేలా అందరూ సహకరించాలని ఆమె కోరారు.


పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ఈ అవాస్తవాలకు దూరంగా ఉండటం.. వాస్తవాలు తెలుసుకోకుండా సంబంధం లేని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి అవాస్తవాలు వ్యాపింపచేయడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసే ఆస్కారం ఉంటుందంటున్నారు. ఇకపై తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa