దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన తనయుడు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని ప్రముఖ సినీ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ వెల్లడించారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ కుటుంబంపై పొగడ్తల జల్లు కురిపించారు. వైఎస్ ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నటుల్లో ఒకరికి కష్టం వచ్చిందని, అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని ఆసుపత్రిలో చేర్చామని, నటులుగా అతడికి తమ వంతు సాయం చేశామని అలీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సాయం అందితే ఆ నటుడికి ఉపయోగకరంగా ఉంటుందని భావించి, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లామని వివరించారు. ఆ నటుడు ఏ పార్టీకి చెందినవాడు అని చూడకుండా రాజశేఖర్ రెడ్డి ఆనాడు రూ.5 లక్షల సాయం అందించారని అలీ పేర్కొన్నారు. వైఎస్సార్ నాడు ఆ నటుడిలో ఓ కళాకారుడ్ని మాత్రమే చూశారని స్పష్టం చేశారు. ఇది 15 ఏళ్ల నాటి మాట అని వెల్లడించారు. ఇప్పుడు తండ్రి బాటలోనే సీఎం జగన్ కూడా నడుస్తున్నారని అలీ కొనియాడారు. ఆపన్నులకు చేయూతనివ్వడంలో జగన్ ఎప్పుడూ ముందుంటారని, అలాంటి కార్యక్రమాలకు పిలిస్తే తప్పకుండా వస్తారని తెలిపారు. అంతేకాదు, పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాటను జగన్ నిలబెట్టుకున్నారని, 11 వేల మంది పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని అలీ వెల్లడించారు. దటీజ్ జగన్ మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa