ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్,,,,నవంబర్ 15 నుంచి టికెట్ల అమ్మకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2023, 07:18 PM

విశాఖలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ జరగనుంది. ఈ నెల 23న నిర్వహించనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించ నున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి.. విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడి యంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం.. అలాగే గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు.. అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడి యంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చన్నారు. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. క్రికెట్ ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకోవాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సూచించింది. మరోవైపు భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. రాష్ట్రంలోని మూడు నగరాల్లో పెద్ద స్క్రీన్లను (ఫేన్‌ పార్క్‌లను) ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వైజాగ్‌ ఆర్కే బీచ్‌ వద్ద కాళీ మాత టెంపుల్‌ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, వైఎస్సార్‌ కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లలో ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశామని.. ఇందులో ప్రవేశం ఉచితం అన్నారు. క్రికెట్‌ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఫుడ్‌ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa