ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలంటే లెక్కలేని తనంతో ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. ఇంతకూ విషయం ఏంటంటే.. జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మంగళవారం మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు హాజరు కాగా.. ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరయ్యారు. దీంతో ఏలూరు కలెక్టర్పై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు జులై 19న జరిగిన కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశానికి కూడా ఏలూరు కలెక్టర్ హాజరు కాలేదు. అప్పుడు కూడా కలెక్టర్ తీరుపై పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్ గైర్హాజరు కావడం పట్ల గతంలోనే ఆయన చీఫ్ సెకట్రరీకి సైతం ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏలూరు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ ఏవేవో కారణాలతో కలెక్టర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇరిగేషన్ బోర్డ్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉందనే సాకుతో జడ్పీ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ హాజరు కాకపోవడం ఎంత వరకు సబబని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రాధాన్యత కలిగిన జడ్పీ సమావేశానికి కలెక్టర్ రాకుండా, కిందిస్థాయి అధికారులను సైతం రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీ సర్వసభ్య సమావేశానికి తాము రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారని.. దీంతో తాను చీఫ్ సెక్రటరీని కలిశానని చెప్పారు. జడ్పీ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ కచ్చితంగా రావాలన్న రూలేమీ లేదన్న పేర్ని నాని.. అయితే కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్లలో ఒకరు హాజరు కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ సమావేశాలకు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ హాజరయ్యేలా చూస్తానని చీఫ్ సెక్రటరీ తనతో చెప్పారన్నారు.
ఇరిగేషన్ అడ్వైజరీ మీటింగ్ను కావాలని ఈరోజే పెట్టారంటూ ఏలూరు కలెక్టర్పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ గైర్హాజరు కావడాన్ని ఆయన ఇగో అనుకోవాలా..? అంటూ నాని అసహనం వ్యక్తం చేశారు. మరో సమావేశం ఏదైనా ఉంటే.. సర్వసభ్య సమావేశానికి ముందుగానీ, తర్వాత గానీ పెట్టుకోవచ్చు కదా అని నాని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కూడా ఈ సమావేశానానికి హాజరు కాలేదన్నారు. గైర్హాజరైన అధికారులకు సంబంధించిన విభాగాలకు మరోసారి మీటింగ్ నిర్వహించాలని జడ్పీ చైర్మన్ రిక్వెస్ట్ చేశారన్నారు.
వరుసగా రెండు సార్లు జడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడంతో ఆయనపై సీఎస్కు సైతం ఫిర్యాదు చేసిన పేర్ని.. ఆ కలెక్టర్తో తనకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. కానీ స్థానిక సంస్థలను ఎవరూ కించపరచొద్దనేదే తన ఉద్దేశమన్నారు. తనకు ఏలూరు జిల్లాలో ఏదైనా పని ఉంటే.. ఆ జిల్లాకు చెందిన నేతలకు, ఇంఛార్జ్ మంత్రులకు చెప్పి చేయించుకుంటానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa