యువకుడు కొత్తగా బైక్ కొనుగోలు చేశాడు. ఆలయంలో పూజ చేయిద్దామని స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకుని సొంత ఊరికి వస్తుండగా ఊహించని విధంగా మృత్యువు వెంటాడింది. ఈ ఘటనలో యువకులిద్దరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన హరినాథరెడ్డి (23), ప్రవీణ్ తేజ (22) శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్నారు.
హరినాథరెడ్డి నూతనంగా కొనుగోలు చేసిన బైక్కు పూజ చేయించేందుకు ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇద్దరూ వెళ్లారు. పూజల అనంతరం తిరుగు ప్రయాణమైన వారు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో వేగాన్ని నియంత్రించుకోలేక ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. బైక్ నడుపుతున్న ప్రవీణ్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ ఘటనలో హరినాథరెడ్డి తలకు బలమైన గాయమైంది.. అతడ్ని వెంటనే 108 అంబులెన్స్లో సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకులిద్దరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటనతో యువకుల సొంత ఊరిలో విషాదచాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa