తెలంగాణ ఎన్నికల హడావిడి నడుస్తోంది.. పార్టీలన్నీ ప్రచారంలో బిజీ అయ్యాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ 75 సీట్లు గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తూ పవన్ కళ్యాణ్ తప్పు చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినా ఇద్దరికి వచ్చేది 5 సీట్లే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా గెలవరని.. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని.. కానీ తమ పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదన్నారు.
బీజేపీ అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు మోహన్. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని.. కోర్టు నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్లో మోదీ చేసిన ప్రసంగం తనకు నచ్చలేదని.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమీ చేయలేదనడం బాధించాయన్నారు. కృష్ణా జిల్లా ఎస్సీల వల్ల గాంధీకి సౌత్ ఆఫ్రికాలో గుర్తింపు వచ్చిందన్నారు. భారత్లో అంటరానితనం ఉందని గాంధీకి తెలిపింది ఎస్సీలు అని.. దేశ స్వతంత్రం, అంటరానితనం గురించి గాంధీ పోరాడారని చెప్పుకొచ్చారు.
ఒకప్పటి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పుడు దళితులు అయ్యారన్నారు. నెహ్రూ, అంబేద్కర్కు మంచి సంబంధాలు ఉండేవని.. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. రాజ్యాంగ రూపకర్తగా రెండు సార్లు అంబేద్కర్ రాజీనామా చేస్తే దాన్ని నెహ్రూ తిరస్కరించారన్నారు. ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. దేశానికి మొదటి రాష్ట్రపతి విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను చేయాలని గాంధీ భావించారని.. కానీ ఆయన చనిపోవడంతో అది జరగలేదన్నారు.
బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. మోదీ, అదానీ, అంబానీలకే అన్ని చేస్తున్నారని మండిపడ్డారు. యూపీలో దళితుల్లో అనేక వర్గాలు ఉన్నాయని.. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని అడిగారన్నారు. ఓట్ల కోసం మోదీ చేస్తున్న ప్రసంగాలను ఖండిస్తున్నానన్నారు. 75 ఏళ్లలో రాజకీయాల్లో బతికి ఉన్నది ఇందిరాగాంధీ మాత్రమే అన్నారు. జగన్ పాలన బాగుంటుందని తాను భావించానని.. తన మిత్రుడు కుమారుడు బాగా చేస్తాడు అనుకున్నానని. . కానీ ఆయన డీలా పడ్డారన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయం బీఆర్ఎస్లో వ్యక్తమవుతోందన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. విద్యుత్ సరఫరా కోసం మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ కేసీఆర్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. పదేళ్ల పాలనలో హైదరాబాద్లో కేసీఆర్ చేసిన అబివృద్ధి ఏమీ లేదన్నారు. హైదరాబాద్ను ఆంధ్రా నేతలే ఎక్కువ అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్లో విశ్వరూప మహాసభలో మోదీ పాల్గొన్నారని.. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మాదిగలను మరోసారి మోసం చేసిందని విమర్శించారు.
తెలంగాణలో మాదిగల ఓట్లు కోసం బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. మంద కృష్ణ బీజేపీకి మద్దతు ఇవ్వటంపై మాదిగల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వ సంస్థల్లోనే రిజర్వేషన్లు తీసేశారని.. ఏపీలో వైద్య కళాశాలల్లో జగన్ రిజర్వేషన్లు రద్దు చేసి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. అంటరానితనం నిర్మూలన కోసం రాజకీయ పార్టీలు కృషి చేయాలని సూచించారు. దళితుల్లో పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఒక్కటే అనే నినాదంతో దళితుల సింహగర్జన ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa