ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యే పీఏపై కానిస్టేబుల్ దాడి.. రోడ్డుపై బైఠాయించిన గోరంట్ల బుచ్చయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 08:03 PM

రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే పీఏపై దాడి వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితుడు చెబుతున్న వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన గోలుకొండ చంద్రశేఖర్‌ ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కరుణ్ అతడ్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో చంద్రశేఖర్‌ వాహన తాళాన్ని కానిస్టేబుల్ తీసుకున్నాడు.. మొబైల్‌లో‌బండి నంబరును ఫొటో తీశాడు. ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న మొబైల్‌ను చంద్రశేఖర్‌ లాక్కునే ప్రయత్నంలో అది రోడ్డుపై పడింది. దీంతో కానిస్టేబుల్‌ తన వాకీటాకీ సెట్‌తో తనపై దాడి చేసినట్లు చంద్రశేఖర్ అంటున్నారు.


చంద్రశేఖర్‌ నుదురు, చెవి వెనుక తలభాగంలో గాయాలయ్యాయి. తాను ఫ్రీలెఫ్ట్‌లో వెళ్తుంటే కానిస్టేబుల్‌ అడ్డగించి దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అక్కడకు వెళ్లి కానిస్టేబుల్‌ తీరును ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి వెళ్లి కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కూడలి దగ్గర సిగ్నల్‌ పడినా ఆగకుండా చంద్రశేఖర్‌ రాంగ్ రూట్‌లో వస్తుంటే తమ కానిస్టేబుల్‌ అడ్డుకుని ఫొటో తీశారని డీఎస్పీలు విజయ్‌పాల్‌, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఫోను లాక్కుని నేలకేసి కొట్టడంతో కానిస్టేబుల్‌ దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై విచారించి కేసు నమోదు చేస్తామని చెప్పి బాధితుడ్ని ఆసుపత్రికి పంపారు. పోలీసులు సర్థిచెప్పడంతో ఎమ్మెల్యే గోరంట్ల ఆందోళనను విరమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa