ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం.. కేంద్రానికి సీఎం నితీశ్ కుమార్ హెచ్చరికలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 11:24 PM

బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరో సంచలన ప్రతిపాదనకు తెరతీశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఇటీవలె కులగణన నిర్వహించి నివేదిక విడుదల చేసిన నితీశ్ సర్కార్.. ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కొత్త డిమాండ్‌కు నితీశ్ కుమార్ తెరలేపారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా.. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం జేడీయూ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు.


బిహార్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి అడ్డుకునేవారు, మద్దతు ఇవ్వనివారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని బిహార్ సీఎం అభివర్ణించారు. ఈ క్రమంలోనే గతంలో మిత్రపక్షంగా ఉండి కూటమి నుంచి బయటికి వచ్చిన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తొందరలో బిహార్‌కు ప్రత్యేక హోదా విషయం తేల్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు.


ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా బిహార్‌లోని ప్రతి గ్రామానికీ ఈ డిమాండ్‌ను తీసుకెళ్లి.. రాష్ట్ర ప్రజలకు దాని అవసరం గురించి చెప్తామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించామని.. అందుకోసం బిహార్‌లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయాల బడ్జెట్ అవసరం అవుతుందని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. అయితే కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తే దాని ద్వారా వచ్చే డబ్బును ఐదేళ్లలో ఖర్చు చేస్తామని నితీశ్ కుమార్ చెప్పారు. అయితే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కల్పిస్తే ఆ సదుపాయాలన్నీ ప్రజలకు రెండున్నరేళ్లలోనే అందించగలుగుతామని వెల్లడించారు. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణమే అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అణగారిన కులాల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రూపొందించిన బిల్లును బిహార్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఇటీవల ఆమోదం తెలిపింది. అదేవిధంగా కులాల సర్వే ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa