నిత్యం వార్తల్లో నిలిచిన కర్ణాటక రాజకీయాల్లో ఏదో ఒక రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. ఎన్నికలు జరిగి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటికీ అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, జేడీఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. అటు.. విపక్షాలపై అదే స్థాయిలో అధికార పార్టీ విమర్శల దాడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంటు వినియోగించుకోవడం కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో కాంగ్రెస్ నేతలు.. కుమారస్వామిని కరెంటు దొంగ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే విద్యుత్ శాఖ వేసిన ఫైన్ను తాను కట్టానని.. తనను దొంగ అనడం సరికాదని కుమారస్వామి పేర్కొన్నారు.
జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చిక్కుల్లో పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా తన ఇంటి దగ్గర్లో ఉన్న ఓ విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించారని గుర్తించిన కర్ణాటక విద్యుత్ శాఖ.. ఆయనకు భారీ జరిమానా విధించారు. అక్షరాలా ఆయనకు రూ.68,526 ఫైన్ వేశారు. దీనిపై కన్నడ నాట తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ జరిమానా మొత్తాన్ని స్థానికంగా ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఆయన శుక్రవారం చెల్లించారు. ఈ విషయంపై తాజాగా కుమారస్వామి స్పందించారు. అయితే ఒక ఈవెంట్ మేనేజర్ చేసిన పనికి తాను చింతిస్తున్నానని చెప్పారు. తాను ఫైన్ కట్టినా.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పదే పదే తనను కరెంట్ దొంగ అని ఆరోపణలు చేయడం.. మీడియాకు ప్రకటనలు ఇవ్వడం సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు తోడు అధికారులు కూడా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని.. ఇప్పటినుంచైనా అలాంటి చర్యలు మానుకోవాలని కుమారస్వామి సూచించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై.. ఆ పార్టీ నేతలపై కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏటా జరిగే కనకపుర ఉత్సవానికి కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేసే పాదయాత్రలకు విద్యుత్ సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుందని.. అప్పుడు ఏమైన జనరేటర్లు వాడుతున్నారా అని కుమారస్వామి నిలదీశారు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎంలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఇలాంటి విషయంపై పార్టీలు రాద్ధాంతం చేయడం చాలా అన్యాయమని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకే రాజకీయంగా తనపై కుట్రలకు పాల్పడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. అయితే తాను చేసిన పని ఏమీ రాష్ట్రం, దేశం మునిగిపోయేంత కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ.. ఎఫ్ఐఆర్లోని లోపాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈనెల 12 వ తేదీన దీపావళి సందర్భంగా బెంగళూరు జేపీ నగర్లోని కుమారస్వామి ఇంటిని అద్భుతంగా అలంకరించారు. ఇందులో భాగంగానే ఇంటి పక్కనే ఉన్న ఓ కరెంటు స్తంభం నుంచి అక్రమంగా కరెంటు సరఫరా తీసుకున్నట్లు బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ అధికారులు గుర్తించారు. దీంతో కుమారస్వామిపై ఏఈఈ ప్రశాంత్ కుమార్ జయనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనపై కేసు నమోదు చేశారు. కుమారస్వామి ఇంటికి విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ సరఫరా అవుతున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో ఉంచడంతో అది వైరల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa