ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. విశాఖపట్నంలో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు భారీ సాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై సోమవారం (నవంబర్ 18) ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు.
ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో రూ. 12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. 30 కోట్ల రూపాయలకు పైనే నష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోట్లలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల విలువైన బోట్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఒక్కో బోటులో రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే చేపలు కూడా దగ్ధమయ్యాయని అంటున్నారు.
సీఎం జగన్ స్పందిస్తూ.. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. సాయం విషయంలో అత్యంత మానవతా దృక్పథంలో వ్యవహరించాలి. మానవత్వం అనే పదానికి అర్థం చెబుతూ.. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలి’ అన్నారు. బోట్లకు బీమా లేదనో, లేదా మరో సాంకేతిక కారణాలనో చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదని అధికారులతో సీఎం జగన్ అన్నారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా ఇవ్వాలని, బాధితులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలని ఆదేశించారు. ఇలాంటి కష్టం కాలంలోనే వారికి పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా మత్స్యకారులకు అధికారులు తగిన తోడ్పాటు అందించాలని సీఎం జగన్ సూచించారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే అంశంపై అధికారులు తుది నివేదిక సిద్ధం చేస్తున్నారని సీఎంఓ అధికారులు తెలిపారు.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన విషయం తెలిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, కారణాలను వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పూర్తి భరోసా ఇవ్వాలని మంత్రి సీదిరి అప్పలరాజుకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa