మన విశాఖపట్నం మత్స్యకారుల బోట్లు కాలిపోతే, నగరం అంతా కాలిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించరా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖపట్నం నగరానికి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదు. పోలవరం కట్టలేదు. స్టీల్ ప్లాంట్ దోచుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో అప్పులతో ఉన్న మా రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని, అహ్మదాబాద్ (గుజరాత్)లో స్టేడియం కడతారు. గుజరాత్ను అభివృద్ధి చేసుకుంటారు. మాకు నరకం చూపిస్తారు’ అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గుజరాతీలు వచ్చి మా పోర్టులు దోచుకుంటారు.. అదానీలు. 8 లక్షల కోట్ల విలువైన మా స్టీల్ ప్లాంట్ను దోచుకుంటారు. నిరుద్యోగులు లక్షల మంది, కోట్ల మంది నాశనమైపోతుంటే.. స్పందించరు. ఏవన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం, మన తెలుగువారిని తిట్టడం. సిగ్గుందా మీకు? మా రాష్ట్రంలో తిరగడానికి? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు’ అంటూ కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఒరేయ్.. మన తెలుగు సత్తా కనీసం ఒక్కసారైనా ఈ బీజేపీకి, మోదీకి, జీవీఎల్ నరసింహారావుకి చూపిద్దాం..’ అని పాల్ పిలుపునిచ్చారు. ‘మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నేనున్నాను. ఇంకో 3, 4 నెలల్లో ఎలక్షన్. చిత్తుచిత్తుగా బీజేపీని ఓడిద్దాం. బీజేపీ-బీ పార్టీలను ఓడిద్దాం. మన 15 కోట్ల మంది తెలుగు సత్తాను ఈ గుజరాతీలకు చూపిద్దాం’ అని పాల్ అన్నారు. ఈ వీడియోను వైరల్ చేయండి అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘అందరికీ కొత్త బోట్లు కొంటాం. కుటుంబానికి కోటి రూపాయల చొప్పున 40 కుటుంబాలకు 40 కోట్లు అదనంగా ఇస్తాం. కొత్త బోట్లు కొంటాం. జీవీఎల్కు, ప్రధాని మోదీకి ఒక్క శాతమైనా చిత్తశుద్ధి ఉంటే, నేను 6 నెలల తర్వాత చేయబోయేది ఇప్పుడే చేయాలి. అందరినీ ఆదుకోవాలి. ప్రధానమంత్రి విశాఖపట్నం రావాలి. లేదా బాయ్కాట్ బీజేపీ.. ఈ వీడియోను వైరల్ చేయండి. తెలుగువాళ్లమందరం ఏకమవుదాం. ప్రాణాలు పోతుంటే, మా రాష్ట్ర గవర్నమెంట్ను తిడతారా? మా రాష్ట్ర ముఖ్యమంత్రులను, గత ముఖ్యమంత్రులను తిడతారా? బీ కేర్ ఫుల్.. అదానీని గానీ.. గుజరాతీలను గానీ.. తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టకుండా చేసేస్తాం’ అంటూ ఫైర్ అయ్యారు పాల్.
అసలేం జరిగింది?
విశాఖ హార్బర్లో ఆదివారం (నవంబర్ 19) రాత్రి కొంత మంది పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కాసేపటికి ఓ బోటులో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న కొంత మంది మత్స్యకారులు అక్కడికి చేరుకొని లంగరు వేసి ఉన్న బోట్లను విప్పి నీటిలోకి వదిలేశారు. అయితే, దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైన బోటు మంటల్లో కాలుతూ వాటి వద్దకు చేరుకుంది. దీంతో 40 బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై స్పందించిన సీఎం జగన్.. మత్స్యకారులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో బోటుకు 80 శాతం వరకు నష్టపరిహారం అందించాలని సూచించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa