అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎదుట మావోయిస్టు పప్పులూరు దళానికి చెందిన ఐదుగురు సభ్యులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పాడేరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం పప్పులూరు దళానికి చెందిన మావోయిస్టు పార్టీ దళ సభ్యులు కిల్లో త్రినాథ్ అలియాస్ రాజేష్.. కిల్లో బాబూరావు అలియాస్ సుత్తి ఒడిశాలోని మల్కానగిరి జిల్లా ఈతలంక గ్రామస్థులు. వీరిద్దరూ పప్పులూరు ఏరియా దళ కమాండర్ పార్వతి ప్రోద్బలంతో 2008లో మిలీషియా సభ్యులుగా చేరి, సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ పప్పులూరు దళంలో కలిమెల, ఏవోబీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు, మందుపాతర పేలుళ్లు, కరువు దాడుల్లో పాల్గొన్నారు.
మిగిలిన ముగ్గురు మిలీషియా సభ్యులైన కిల్లో రాజు, వంతల భగత్ రామ్, పాంగి సదునో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీకి ఆదరణ తగ్గిపోవడం, పోలీస్ కాంపులు పెరగడంతో స్వేచ్ఛగా తిరగలేక.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో వీరు మనసు మార్చుకుని లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు. నిరుద్యోగ గిరిజన యువతకు కల్పిస్తున్న ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు, నిరుద్యోగ గిరిజన యువతకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ రుణాలు అందించే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయంతో స్వచ్చందంగా లొంగిపోయినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa