జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లా బాజీ మాల్ అడవుల్లో బుధవారం ఉదయం నుంచి భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు సైనికులు అమరుడయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ ప్రత్యేక బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో ఎన్కౌంటర్కు దారితీసింది.
ముష్కరుల కాల్పుల్లో గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ నలుగురు కన్నుమూశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోన్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతం కాల్పులతో దద్ధరిల్లుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కశ్మీర్లోని పీర్ పంజాల్ అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్లతో భద్రతా దళాలకు సవాల్గా మారింది. దట్టమైన అడవులను ఉగ్రవాదులు తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రమాదకరమైన పర్వతాలు, దట్టమైన అరణ్యాలు, ఆల్పైన్ అడవులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గత వారం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa