ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే ఉత్తరాఖండ్ టన్నెల్‌ నుంచి బయటికి రానున్న కార్మికులు.. 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 11:27 PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయి 12 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలోనే అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను ప్రాణాలతో వెలికి తీసేందుకు అధికారులు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శిథిలాలు కూలిపోయి ప్రాంతంలో అమెరికన్ ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్ ప్రారంభించింది. అతి త్వరలోనే టన్నెల్‌లో గత కొన్ని రోజులుగా ఇరుక్కుపోయిన కార్మికులు బయటికి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వారు టన్నెల్ నుంచి బయటికి రాగానే.. ఇన్ని రోజుల పాటు ఆ సొరంగంలో ఉన్న వారికి వైద్య సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లను తరలించారు. కార్మికులకు చికిత్స చేసేందుకు 41 పడకలతో ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు.


సిల్క్యారా టన్నెల్ నుంచి 41 మంది కార్మికులు బయటకు వచ్చిన వెంటనే వారికి వైద్య చికిత్స అందించేందుకు బుధవారం 41 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. వారిని ఆస్పత్రికి తీసుకువచ్చేందుకు టన్నెల్ కూలిన ప్రాంతంలో అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఇక


సొరంగంలో బుధవారం రెస్క్యూ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సొరంగం కూలిన ప్రాంతంలో గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాల నుంచి అమెరికన్ డ్రిల్లింగ్ మెషీన్ డ్రిల్లింగ్ ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం వరకు 45 మీటర్ల లోపలికి డ్రిల్లింగ్ వేసింది. 6 మీటర్ల పొడవు కలిగి 800 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన మరో 2 స్టీల్ పైపులను సొరంగంలోకి పంపించేందుకు శిథిలాలను దాదాపు 12 మీటర్లు తవ్వాలని అధికారులు పేర్కొన్నారు.


మరోవైపు.. ఉత్తర కాశీ జిల్లాలోని అన్ని ఆస్పత్రులను అలర్ట్ చేశారు. వాటితో పాటు ఎయిమ్స్, రిషికేష్‌ ఆస్పత్రుల్లో కూడా బాధిత కార్మికులకు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే శిథిలాల అవతలి వైపు చిక్కుకున్న కార్మికులను చేరుకునేందుకు మొత్తం 57 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిశీలించారు. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ కోసం ఆక్సిజన్ మాస్కులతో 21 మంది రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి ప్రవేశించారు. నవంబర్ 12 వ తేదీన సిల్క్యారా సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనతో అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలోని బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తర కాశీ సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సమాచారాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa