పొరుగు దేశం చైనాలో అక్టోబరు మధ్య నుంచి అంతుచిక్కని న్యూమోనియాతో ఆస్పత్రులకు బాధితులు క్యూకడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కోవిడ్-19 నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఈ కొత్తరకం న్యుమోనియా కేసులు పెరగడం మరో మహమ్మారిగా మారుతుందేమోనని భయపడుతున్నారు. పెద్ద సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడి, ఆస్పత్రుల్లో చేరడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల వ్యాప్తిని ట్రాక్ చేసే మీడియా అండ్ పబ్లిక్ డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్ నివేదికను ఉదహరిస్తూ.. ఉత్తర చైనాలోని ఈ వైరస్ వ్యాపిపై మరింత డేటా అందజేయాలని డ్రాగన్ను కోరింది.
పిల్లలలో అంతుచిక్కని న్యుమోనియా గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ వైరస్ ఉత్తర చైనాలో మొదటిసారి వ్యాప్తిలోకి వచ్చింది. న్యూమోనియా వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఇప్పటి వరకూ ఇది ఏ వ్యాధి అనేది గుర్తించలేదు. నేషనల్ హెల్త్ కమిషన్కు చెందిన అధికారులు నవంబరు 13న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, దేశంలో శ్వాసకోస వ్యాధి కేసులు పెరుగుతున్నట్టు వెల్లడించినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా సైతం అక్టోబరు నుంచి ఇన్ఫ్లూయెంజా పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్టు చూపుతోంది. ఇక, కొత్తరకం న్యూమోనియా బాధితుల్లో కరోనా మాదిరిగానే జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు సమాచారం. చైనా అధికార వర్గాలు మాత్రం కోవిడ్-19 ఆంక్షలు ఎత్తివేయడం, ఇన్ఫ్లూయోంజా, మైకోప్లాస్మా న్యుమోనియా (పిల్లల్లో ఒక సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్), రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వంటివి శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.
నవంబర్ 21న మీడియా అండ్ పబ్లిక్ డిసీజ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఉత్తర చైనాలోని పిల్లలలో గుర్తించబడని న్యుమోనియా వ్యాప్తిలో ఉన్నట్టు నివేదించింది. దీంతో అప్రమత్తమైన డబ్ల్యూహెచ్ఓ.. పూర్తి వివరాలను అందజేయాలని చైనాను కోరింది. వ్యాప్తి స్వభావం, కారణాన్ని అర్థం చేసుకోవడం సహా దానిని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా డేటాను డబ్ల్యూహెచ్ఓ కోరినా.. డ్రాగన్ ఇంత వరకూ స్పందించలేదు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి కూడా తొలుత చైనాలోనే వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కొత్తరకం న్యూమోనియా ప్రపంచానికి మరో ముప్పుగా మారుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్ల్యూహెచ్ఓ స్పందన.. సంభావ్య ప్రపంచ ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. డబ్ల్యూహెచ్ఓ సహా అంతర్జాతీయ నిపుణుల సహకారంతో న్యుమోనియాకు కారణాన్ని గుర్తించడానికి చైనా అధికారులు కృషి చేస్తున్నారు. కోవిడ్-19 మాదిరి లక్షణాలే ఉండటంతో ప్రాథమిక ప్రాథమిక పరీక్షలలో కొత్తరకం కరోనా కాదని తేలింది. అయినప్పటికీ, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాధికారక స్వభావాన్ని గుర్తించడానికి పరిశోధనలు చాలా ముఖ్యం. కోవిడ్-19 మహమ్మారి తరువాత కొత్త అంటు వ్యాధుల సంభావ్య ప్రమాదాల గురించి ప్రపంచ సమాజం మరింత అప్రమత్తంగా ఉంది. ఈ పరిస్థితి అంటు వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
వ్యాప్తి బలమైన ప్రజారోగ్య వ్యవస్థల అవసరాన్ని, పెరుగుతున్న అంటు వ్యాధులను ఎదుర్కొనే సంసిద్ధతను తెలియజేస్తుంది. ప్రజారోగ్యంలో నిఘా, వేగవంతమైన ప్రతిస్పందన విధానాలు, ప్రపంచ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కాగా, ప్రపంచ ఆరోగ్య అధికారులతో పాటు డబ్ల్యూహెచ్ఓ ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది. అయితే, 2019లో వెలుగుచూసిన కరోనా వైరస్, ఇప్పుడు కొత్తరకం న్యూమోనియాకు దగ్గర పోలికలు ఉన్నాయి. తొలిసారి 2019 నవంబరులో వుహాన్ నగరంలో అంతుచిక్కని వైరస్తో జనాలు ఆస్పత్రుల్లో చేరారు. డిసెంబరు నాటికి క్రమంగా పెరిగి... మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa