ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇదేం రూల్‌ సార్.. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, గిన్నెలు కడగకపోయినా భారీ ఫైన్

international |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 12:21 AM

చైనా అంటేనే ఒక రకమైన దేశం. అక్కడి ప్రభుత్వం విధించే నిబంధనలు, ఆంక్షలు రకరకాలుగా ఉంటాయి. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచని వారికి భారీగా జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఈ వింత నిబంధన చూసి స్థానికులు అవాక్కవుతున్నారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని తాజాగా అధికారులు ప్రకటించినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. పుగే కౌంటీ అధికారులు తాజాగా విధించిన నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న ప్రజలు తమ ఇళ్లను, ఇంట్లోని వంట గిన్నెలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఒకవేళ అలా చేయకుంటే 1.4 డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో రూ.130 జరిమానా వేయనున్నారు. ఇక కింద కూర్చుని భోజనం చేస్తే 2.8 డాలర్లు అంటే రూ.240 ఫైన్ వేయనున్నట్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


అయితే ఈ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ అధికారులు తాజాగా స్పందించారు. పుగే కౌంటీలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కొత్తగా రూపొందించిన విధివిధానాల్లో భాగంగా ఈ వింత నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడానికి సంబంధించి ఫైన్ విధించే కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అయితే ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు ప్రతీ ఒక్కరి ఇంటికి వచ్చి తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. అధికారులు తనిఖీల చేసిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతర కీటకాలు, దుమ్ము ధూళి ఉంటే మొదటిసారి 3 నుంచి 10 యువాన్లు జరిమానా విధించనున్నట్లు చెప్పారు.


ఆ తర్వాత రెండోసారి కూడా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరిశుభ్రత లేకుంటే ఆ జరిమానాను రెట్టింపు చేస్తారని పేర్కొన్నారు. ఈ నిబంధనపై కౌంటీ వైస్‌ డైరెక్టర్‌ మీడియాకు చెప్పారు. స్థానికంగా అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే పుగే కౌంటీలోని కొందరి ప్రజల ఇళ్లలో చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇల్లు మొత్తం బూజు పట్టి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని.. వారు తినే ప్రాంతంలో కూడా దోమలు, కుక్కలు తిరుగుతున్నాయని తెలిపారు. అయితే కేవలం ఫైన్లు విధించడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించలేమన్న అధికారులు.. ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నామని పుగే కౌంటీ వైస్‌ డైరెక్టర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa