విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో నిందితుల్ని పోలీసులు గుర్తించారు. అనుకోని సంఘటనతో బోటులో మంటలు రేగాయని, సముద్రగాలులు తోడై పెద్దసంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. విశాఖపట్నం చెంగలరావుపేటకు చెందిన వాసుపల్లి నాని ఆరేళ్లపాటు బోట్లలో వాచ్మన్గా పనిచేశాడు. రెండేళ్లుగా చేపల వేటకు వెళ్తున్నాడు. ఆదివారం రాత్రి నాని, తన మేనమామ సత్యంతో కలిసి 887 నంబరు బోటులో మద్యం తాగారు. అందులో ఉన్న స్టవ్పై ఎండు చేపలు ఫ్రై చేసుకుని తిన్నారు. ఈ క్రమంలో నాని సిగరెట్ తాగి పడేయడంతో అది పక్కనే ఉన్న 815 నంబరు బోటులోని నైలాన్ వలలపై పడి అగ్గి రాజుకుంది. కొద్ది సేపటికి మంటలు రావడంతో భయపడిన నాని, సత్యం అక్కడి నుంచి పారిపోయారు. 815 బోటులో రేగిన మంటలకు ఈదురు గాలులు తోడయ్యాయి. పక్కనే ఉన్న బోట్లకు మంటలు అంటుకుని కాలిపోయాయి.
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. హార్బర్ పరిధిలోని సుమారు 47 సీసీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించి అనుమానితుల్ని గుర్తించారు. నిందితులు ఘటనా స్థలం నుంచి బైకుపై పారిపోతూ... మలుపు దగ్గర హారన్ కొట్టారు. కుక్కఅరుపులా ఉన్న ఆ హరన్ ఉన్న బైకు ఎవరిదో అక్కడి వారికి తెలియడంతో కొద్దిసేపటి తర్వాత ఏమీ ఎరగనట్లు మళ్లీ సంఘటన స్థలానికి వచ్చారు. ప్రమాద సమయంలో ఓడరేవు నుంచి వెళ్లిన బైకు వాసుపల్లి నానీదేనని స్థానికులు పోలీసులకు చెప్పారు. విచారణలో భాగంగా యూట్యూబర్ నానీని కూడా తీసుకొచ్చి ప్రశ్నించామని, ఆయనకు సంబంధం లేదని విడిచిపెట్టామని తెలిపారు. అయితే యూట్యూబర్ నాని కోర్టును ఆశ్రయించారని, కేసుకు సంబంధించిన అంశాల్ని న్యాయస్థానం ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa