తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడనే అభియోగంపై భారతీయ విద్యార్ధిని అమెరికా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. న్యూజెర్సీ సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్లోని ఓ రెండంతస్తులో భవనంలో వృద్ధ జంటతో పాటు వారి కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం పోలీసులు గుర్తించారు. 23 ఏళ్ల ఓం బ్రహ్మ్భట్ అనే భారతీయ విద్యార్ధి.. తన తాత దిలీప్ కుమార్ కుమార్ బ్రహ్మభట్ (72), అమ్మమ్మ బిందు బ్రహ్మభట్ (72) , బాబాయి యష్ కుమార్ బ్రహ్మభట్ (38) లను కాల్చి చంపినట్లు పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.
సౌత్ ఫ్లెయిన్ఫీల్డ్లోని కాండో కాంప్లెక్స్ భవనంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంంలో కాల్పులు చోటుచేసుకున్న విషయం గురించి సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ, ఇద్దరు పురుషులు చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఓం బ్రహ్మ్భట్ను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడు ఆయుధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గుజరాత్కు చెందిన బ్రహ్మభట్.. మృతుల కుటుంబంతో కలిసి ఉంటున్నాడని తెలిపారు.
తాము సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అతడు అక్కడ కనిపించాడని అన్నారు. ఆన్లైన్తో తుపాకీని కొనుగోలు చేసి.. దాంతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం సౌత్ ప్లెయిన్ఫీల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ కేసును విచారిస్తోంది. ‘ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు.. ఇది యాదృచ్ఛిక హింసాత్మక చర్య కాదని ప్రాథమిక దర్యాప్తులోనే నిర్ధారించాం.. సౌత్ ప్లెయిన్ఫీల్డ్కు చెందిన ఓం బ్రహ్మభట్ (23) అనే యువకుడు బాధితులతో కలిసి ఉంటున్నాడు.. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు నివాసంలో కనిపించాడు’ అని మిడిల్సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది.
ఏడాది కిందటే ఉన్నత విద్య కోసం న్యూజెర్సీకి వచ్చిన బ్రహ్మభట్.. బంధువులతో కలిసి ఉంటున్నాడని, తాత దిలీప్కుమార్ బ్రహ్మభట్ పట్టుబట్టడంతో ఆయన అమెరికా వెళ్లినట్లు ఆయన బంధువులు కొందరు తెలిపారు. కాల్పుల తర్వాత అతడే పోలీసులకు ఫోన్ చేశాడని, వాళ్లు వచ్చిన తర్వాత ఈ పని ఎవరు చేశారని అడిగితే తానే కావచ్చని చెప్పాడని అన్నారు. ప్రస్తుతం మిడిల్సెక్స్ అడల్డ్ కరెక్షనల్ ఫెసిలిటీలో పోలీసులు విచారిస్తున్నారు. తొలుత నిద్రపోతున్న అమ్మమ్మ తాతయ్యలను తలపై కాల్చి, అనంతరం మరో గదిలో నిద్రపోతున్న యశ్కుమార్పై పలుసార్లు కాల్పులు జరిపినట్టు విచారణలో వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa