ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జునసాగర్ వివాదం.. ఏపీ పోలీసులపై కేసు మోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 06:47 PM

నాగార్జునసాగర్ దగ్గర పోలీసుల పహారా కొనసాగుతోంది. అయితే ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారనని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


నాగార్జున సాగర్‌ విజయపురి టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. A-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో.. సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారన్నారు. కుడికాల్కువ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారని.. ఇది కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసుల ఫిర్యాదు చేశారు. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


మరోవైపు ఇవాళ కూడా ఏపీ వైపు పోలీసుల్ని భారీగా మోహరించారు. ఏపీకి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్‌, నీటి పారుదలశాఖ అధికారులు సమీక్ష చేస్తారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది అంటున్నారు.


గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్‌ దగ్గరే ఉంటున్నారు. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది.


రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు.. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు.. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa