సాగర్ జలవివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక ఆదేశాలు జారీచేసింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేయాలని ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీలను విడుదల చేసినట్లు లేఖలో స్పష్టం చేశారు. అయితే, నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై తమకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తతి అందలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
అక్టోబర్ 10- 2024 ఏప్రిల్ 18 మధ్య 15 టీఎంసీల నీటి మూడు విడతల్లో 5 టీఎంసీల చొప్పున ఇవ్వాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది. తొలి విడతగా అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు విడుదల చేశామని, రెండో విడతగా జనవరిలో 5 టీఎంసీలు.. మూడో విడతగా ఏప్రిల్లో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని తెలిపింది. ఎలాంటి సమాచారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నాడు నీటిని విడుదల చేసిందని.. విడుదలను తక్షణమే ఏపీ ప్రభుత్వం ఆపాలని కృష్ణా బోర్డు కోరింది.
కాగా, తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఏపీ వైపున భారీగా పోలీసులను మోహరించారు. సుమారు 1200 మంది పోలీసులు అక్కడ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా.. కేఆర్ఎంబీ అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయాన్ని ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇది సక్రమంగా అమలు కావడంలేదు. నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఏపీ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి.
కుడి కాల్వ నుంచి ఏపీకి నీటిని తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. అంతేకాదు, నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం తమకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదని తెలంగాణ చెబుతుోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa