సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్గా భావిస్తూ వచ్చిన శాసనసభ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ను గద్దె దించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది. రాజస్థాన్లో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాదనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. అయితే, రాజస్థాన్లో ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని నియమిస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేసులో పలువురు నాయకులు ఉండటమే దీనికి కారణం.
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బాబా బాలక్నాథ్, దియా కుమారి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాలే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఉత్తర్ ప్రదేశ్ మాదిరిగా మరో యోగి పేరు తెరపైకి వచ్చింది. యోగి ఆఫ్ రాజస్థాన్గా పేరు తెచ్చుకున్న బాబా బాలక్నాథ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయన తిజారా అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 40 ఏళ్ల బాలక్నాథ్ 1984లో బెహ్రోడ్లోని ఓ గ్రామంలో యాదవ కుటుంబంలో జన్మించారు. రోహ్తక్లోని మస్త్నాథ్ మఠానికి ఎనిమిదో మహంత్. బాలక్నాథ్ తరఫున ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించారు. అయితే, బాలక్నాథ్ వివాదాలతోనూ వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్తో పోటీని ‘భారత్ -పాకిస్థాన్’ మ్యాచ్తో పోల్చి వివాదంలో ఇరుకున్నారు.
‘ఈ సమయం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లాంటింది.. కేవలం విజయం కోసమే తలపడటం కాదు.. ఓటింగ్ శాతం కూడా పెంచుకోవాలి’అన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అల్వార్ ఎంపీ అయిన బాలక్నాథ్కు ఒకవేళ రాజస్థాన్ పగ్గాలు అప్పగిస్తే.. యోగి ఆధిత్యనాథ్ తర్వాత సీఎం పదవిని అధిష్ఠించిన రెండో సన్యాసి అవుతారు. సీఎం రేసులో మీరు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘మా ప్రధాని బీజేపీకి ప్రధాన ఆకర్షణ.. ఆయన నాయకత్వంలో మేము పని చేస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఎవరనేది కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎంపీగా సంతోషంగా ఉన్నాను.. సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను.. దానితో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.
ఆయనతోపాటు రాజస్థాన్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించిన వసుంధర రాజే, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి కూడా సీఎం ఆశావహుల జాబితాలో ఉన్నారు. 2013లో బీజేపీలో చేరినప్పటి నుంచి దియా వరుసగా మూడుసార్లు సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఆమె అనేక అభివృద్ధి పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. వీరు మాత్రమే కాకుండా గజేంద్ర సింగ్ షెకావత్, కిరోరీ మాల్ మీనా, సీపీ జోషీ కూడా ముఖ్యమంత్ర పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa