మంగళగిరిలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు రామకృష్ణారెడ్డి చెప్తున్నప్పటికీ.. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితోనే రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆ నియోజకవర్గ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాడేపల్లికి చెందిన పలువురు వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు మున్నంగి వివేకానంద రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేశారు. జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి, మంగళగిరి రూరల్ మండలం జేసీఎస్ కన్వీనర్ బ్రహ్మర్గన రెడ్డి కూడా పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతారనే ప్రచారంతోనే ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీసీ నేత గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వొచ్చనే వార్తలతో ఆళ్ల అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. అలాగే మంగళగిరి నియోజవర్గానికి సంబంధించి నిధుల విడుదల విషయంలోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తు్న్నాయి. మరోవైపు మంగళగిరిలో రాజీనామాల పర్వం మొదలు కావటంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. మంగళగిరి వైసీపీ నేతలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రమ్మని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ హనుమంతరావు, గంజి చిరంజీవి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గంజి చిరంజీవి ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa