ఆరేబియా సముద్రంలో ఓ వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఐరోపా దేశం మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ వాణిజ్య నౌక... సోమాలియా తీరం మీదుగా వెళ్తుండగా హైజాక్కు గురయ్యింది. సముద్రపు దొంగలు చొరబడి నౌకను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో నేవీ అప్రమత్తమైంది. మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, యుద్ధ నౌకను రంగంలోకి దిపింపినట్టు నేవీ శనివారం అధికారిక ప్రకటన వెల్లడించింది.
‘డిసెంబరు 14న రాత్రి సమయంలో ఎంవీ రుయెన్ నౌక యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్లో మేడే (అత్యవసర పరిస్థితిని తెలియజేసే) సందేశం పంపింది.. నౌకలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారని ఆ మెసేజ్ సారాంశం. దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న నావల్ మారిటైం పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది’ అని నేవీ తెలిపింది.
‘భారత నౌకాదళం ఈ ప్రాంతంలో మొదటి ప్రతిస్పందనదారుగా ఉండటానికి, అంతర్జాతీయ భాగస్వాములు, స్నేహపూర్వక దేశాలతో పాటు వాణిజ్య నౌకను భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉంది’ అని ప్రకటనలో పేర్కొంది. హైజాక్కు గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారని, దానిపై వారు నియంత్రణ కోల్పోయినట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. రుయెన్ నౌకకు సాయంగా భారత నేవీ విమానం, యుద్ధ నౌక అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం అది సోమాలియా తీరం దిశగా ప్రయాణిస్తోంది. దాని పైనుంచే నేవీ ఎయిర్క్రాఫ్ట్ ప్రయాణిస్తోంది. మరోవైపు, శనివారం తెల్లవారుజామున రుయెన్ నౌకను భారత యుద్ధనౌక విజయవతంగా అడ్డగించినట్లు నేవీ పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, నిశితంగా గమనిస్తున్నామని చెప్పింది.
కాగా, 2017 తర్వాత సోమాలియా పైరెట్లు నౌకలపై జరిపిన అతిపెద్ద దాడి ఇదే. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు యూకే నేవీ హెచ్చరికలు పంపింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది. కాగా, గత నెలలో టర్కీ నుంచి భారత్కు వస్తున్న ఇజ్రాయేల్ నౌకను యెమెన్కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో హైజాక్ చేశారు. ఇజ్రాయేల్లో అత్యంత సంపన్నుడైన అబ్రహాం రామి ఉంగర్కు చెందిన రే కార్ క్యారియర్స్ సంస్థ పేరుతో ఉన్న ఈ నౌకను బ్రిటన్ కంపెనీ యాజమాన్యంలో జపాన్ నిర్వహిస్తోంది. గాజాపై ఇజ్రాయేల్ దళాల దాడులను వ్యతిరేకిస్తూ హమాస్కు మద్దతుగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్యకు పా్లపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa