పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రతన్ టాటా ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయనకు భద్రతను పెంచాలని.. లేదంటే సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని బెదిరించినట్టు పేర్కొన్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రతన్ టాటాకు భద్రతను పెంచి, కొన్నిచోట్ల తనిఖీలు కూడా చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పుణెకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అతడు, కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు. కర్ణాటకలో ఉన్నట్టు తేలింది. అక్కడ నుంచి ముంబయి పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. అతడ్ని పుణే పోలీసులకు అప్పగించారు. ఐదు రోజుల కిందటే అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది సెప్టెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబయికి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఆయన వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa