2019 లో వెలుగు చూసిన కొవిడ్ మహమ్మారి మానవాళిని మొత్తం 2 ఏళ్ల పాటు వణికించింది. కరోనా వైరస్ సోకి జనం పిట్టల్లా రాలిపోవడం, శ్వాస కోస సమస్యలతో బాధపడుతుండటం వంటి భయానక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కొవిడ్ పూర్తిగా అంతం అయిందని సంతోషించేలోపే మరోసారి ప్రపంచంపై పడగ విప్పేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే కొత్త కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో ఆ దేశంలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితోపాటు ఎయిర్పోర్టుల్లో థర్మల్ స్కానర్లు కూడా ఏర్పాటు చేసింది.
మాస్క్లను తప్పనిసరి చేస్తూ సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఎయిర్పోర్టులకు వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ను ధరించాలనే మళ్లీ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రత కొలిచేందుకు థర్మల్ స్కానర్లను కూడా మళ్లీ ఏర్పాటు చేసింది. కరోనా వైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా ప్రజలకు శ్వాస సంబంధిత వ్యాధులు శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తూ.. చాలామందిని కలుస్తుంటారని.. దీని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పింది.
అయితే సింగపూర్ కంటే ముందే ఇండోనేసియా ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలను మొదలు పెట్టింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న దేశాలకు వెళ్లొద్దని ఇండోనేసియా పౌరులకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని.. మాస్క్లు ధరించి.. ఇతర కొవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని కోరింది. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో మళ్లీ కొవిడ్ నిబంధనలు, ఆంక్షలు తీసుకువస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని.. సింగపూర్ డిప్యూటీ ప్రధాని లారెన్స్ వాంగ్ ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొనడంతో సింగపూర్వాసుల్లో తీవ్ర భయాందోళనలు ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa