ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ దాడుల్లో దొరికిన ఆ డబ్బు నాది కాదు.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 10:33 PM

ఝార్ఖండ్‌ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు సంబంధించిన డిస్టిలరీ సంస్థల్లో ఇటీవల ఐటీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కళ్లుబైర్లు కమ్మేలా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాడుల్లో మొత్తం రూ.353.5 కోట్ల నగదు పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉండగా.. మనీహైస్ట్ (పాపులర్ వెబ్‌ సిరీస్‌) అవసరం ఎవరికి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, ఆదాయపన్ను అధికారులు దాడులపై ఎంపీ ధీరజ్ సాహు తొలిసారిగా స్పందించారు.


ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగదు తనది కాదని.. తన కుటుంబ సభ్యులు నిర్వహిస్తోన్న సంస్థలకు చెందిందని పేర్కొన్నారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కి గానీ, మరే ఇతర పార్టీలకి గానీ సంబంధం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ‘గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.. తొలిసారి నా మీద ఇటువంటి ఆరోపణ రావడం బాధాకరం. అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు నాది కాదు.. నా కుటుంబసభ్యులకు చెందిన సంబంధించింది. మా కుటుంబం గత 100 ఏళ్లుగా మద్యం వ్యాపారాలు నిర్వహిస్తోంది.. నేను రాజకీయాల్లో క్రీయశీలకంగా ఉండటం వల్ల వ్యాపారంపై పెద్దగా దృష్టి సారించడం లేదు.. నా కుటుంబసభ్యులే వాటిని నిర్వహిస్తున్నారు. క్రయవిక్రయాలు, లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతుంటాయి.. అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బంతా మా కంపెనీలకి చెందినదే. వాటితో కాంగ్రెస్‌, ఇతర ఏ పార్టీలకూ సంబంధం లేదు. దీనిపై నా కుటుంబసభ్యులు వివరణ ఇస్తారు. అవసరమైతే ఆదాయపన్ను శాఖ విచారణకు పూర్తిగా సహకరిస్తా’ అని ధీరజ్‌ సాహూ తెలిపారు.


ఎంపీ ధీరజ్‌ సాహూది ఉమ్మడి కుటుంబం కాగా.. ఆరుగురు అన్నదమ్ములు. వీరంతా కలిసే బౌద్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మద్యం వ్యాపారంతోపాటు పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు. వారి పిల్లలు కూడా ఆయా కంపెనీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా, దేశంలో ఐటీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు లభ్యం కావడం ఇదే మొదటిసారి. 176 బ్యాగుల్లో లభ్యమైన నగదును లెక్కించడానికి ఐదు రోజుల పాటు 50 మంది అధికారులు శ్రమించారు. ఎంపీ కంపెనీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీ ఇంటి నుంచి.. ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa