టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుది అంకానికి చేరింది. ఇవాళ విశాఖ జిల్లాలో యువగళంకు ముగింపు పలకబోతున్నారు లోకేష్. ఈ సందర్భంగా.. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో.. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారా.. లేదా అనే సందిగ్థత కొసాగింది. ముందు జనసేనాని సభకు హాజరవుతున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి.. కానీ ఆ తర్వాత పవన్ రావడం లేదనే చర్చ జరిగింది. టీడీపీ కూడా రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన పోస్టర్లో చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇవాళ మరో కొత్త పోస్టర్తో టీడీపీ ట్వీట్ చేసింది. యువగళం ముగింపు సభకు పవన్ కూడా వస్తున్నారని పోస్టర్ ద్వారా తెలిపింది. 'రండి... చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవ్వండి! ఒకే వేదికపై తిరుగులేని ప్రజా నాయకుల అపూర్వ సంగమం. విశాఖలో యువగళం - నవశకం కార్యక్రమ వేదికపై తెలుగుదేశం, జనసేన అధినేతలు' అంటూ పిలుపునిచ్చారు.
అంతేకాదు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం సభకు పవన్ వస్తారని అధికారికంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలపాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. ఒక్క అడుగుతో మొదలై యువత ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచింది అన్నారు. 226 రోజులపాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3132 కిలో మీటర్లు విజయవంతంగా సాగిందన్నారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహిస్తున్న యువగళం - నవశకం సభను చారిత్రాత్మకంగా నిలుపుదామని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఈ యువగళం సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు టీడీపీ తాజాగా ట్వీట్ చేసిన ఈ పోస్టర్ను బట్టి అర్థమవుతోంది. పవన్తో పాటుగా మరికొందరు జనసేన పార్టీ నేతలు కూడా పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని కొన్ని కారణాల వల్ల ముందు రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఈ భేటీ సందర్భంగా బాబు కూడా పవన్ను సభకు రావాలని ఆహ్వానించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఆహ్వానంతో జనసేనాని సభకు హాజరవుతాను అనడంతోనే కొత్త పోస్టర్ను ట్వీట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ గ్రేటర్ విశాఖ పరిధిలోని శివాజీనగర్లో ముగియబోతోంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమై విశాఖలో ముగుస్తోంది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని భావించారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాదాపు 50 రోజులకుపైగా పాదయాత్ర ఆగిపోయింది.. ఇప్పుడు ఇచ్చాపురం వరకు కొనసాగించే పరిస్థితి లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో విశాఖలోనే ముగింపు పలుకుతున్నారు. అందుకే విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa