ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కార్ కీలక నిర్ణయం.. లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 11:16 PM

అతి వేగం, నిద్రమత్తు కారణంగానే రాత్రి పూట చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. నిరంతరాయంగా లారీ డ్రైవర్లు వందల కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల అలసటతో నిద్రమత్తు వచ్చి ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు అర్ధరాత్రులు చోటు చేసుకోకుండా ఒడిశా ప్రభుత్వం కొత్త ప్రయత్నానికి తెర తీసింది. రాత్రి పూట హైవేలపై ప్రయాణించే లారీ డ్రైవర్లకు నిద్రమత్తు వదిలేలా వేడి వేడి టీని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే హైవేలపై ఉన్న దాబాల్లో లారీ డ్రైవర్లకు ఉచితంగా ఛాయ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ముందుగా రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. అయితే ఈ పూర్తి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఒడిశా రవాణా శాఖ మంత్రి టుకుని సాహు గురువారం వెల్లడించారు. రహదారులపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారని.. ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలు జారీ చేశారని మంత్రి టుకుని సాహు చెప్పారు. హెల్మెట్‌లు లేకుండా బైక్‌లు నడపకూడదని ఇప్పటికే ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు వివరించారు. మరోవైపు.. సరకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటారని.. అలాంటి వారికి హైవేలపై ఉండే దాబాలు, హోటళ్లలో ఫ్రీ టీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.


టీ తాగిన తర్వాత లారీ డ్రైవర్లు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేలా హైవేల పక్కన కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఒడిశాలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్‌ నిర్మిస్తున్నామని.. అందులో లారీ డ్రైవర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రైవర్లు నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa