ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో ఉగ్రమూకల దుశ్చర్య.. పూంఛ్ దాడిలో అమరులైన ఐదుగురు జవాన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 11:35 PM

జమ్మూ కశ్మీర్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పూంఛ్‌ జిల్లాలోని డేరా కి గలి సమీపంలో రెండు సైనిక వాహనాలపై గురువారం మధ్యాహ్నం సాయుధ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో మగ్గురు భద్రతా సిబ్బంది గాయపడిగా.. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. సురాన్‌కోట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని డేరా కి గాలి, బుఫ్లియాజ్‌ మధ్య ధత్యార్‌ మోర్‌ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి చోటుచేసుకుంది.


నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి డేరా కి గాలి ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్య చేపట్టినట్లు రక్షణ శాఖ అధికారప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ సునీల్‌ బర్త్వాల్‌ తెలిపారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయని అన్నారు. ఇందు కోసం అదనపు సైనికులను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. ఈ దాడికి పాల్పడిందే తామేనంటూ పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించుకుంది.


ఆ ప్రాంతంలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పుల కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. ముష్కర మూకలు పక్కా పథకంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో జరిగిన రెండో ఘటన ఇది. గత నెలలో రాజౌరీ వద్ద జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, మరో ఐదుగురు సైనికులు నేలకొరిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa