ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసోంలో రూ.4.5 కోట్ల విలువైన 500 అరుదైన చేపలు స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 11:23 PM

అసోంలో రూ.4.5 కోట్ల విలువైన అరుదైన చేపలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘చన్నా బర్కా’ రకానికి చెందిన 500 చేపలను దిబ్రూఘర్ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు గురువారం అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న ఈ చేపలను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో అటవీ సిబ్బంది చేపలను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దానిని విమానాశ్రయానికి తీసుకువచ్చిన డ్రైవర్‌, మరో వ్యక్తిని పట్టుకున్నారు.


వారిని గుయిజాన్‌కు చెందిన శ్రీధర్ సర్కారు, జితేన్ సర్కార్‌గా గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 2 జాబితాలోని ‘చన్నా బార్కా’ చేప అంతరించిపోతున్న వర్గం కిందకు వస్తుంది. ఇది ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్‌లోని ఎగువ బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో లభిస్తుంది. అరుదైన ఈ స్నేక్‌హెడ్ చేపలను 2014లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ బంగ్లాదేశ్‌లో అంతరించిపోతున్నాయని అంచనా వేసింది. కాగా, స్వాధీనం చేసుకున్న ఈ చేపలను తిరిగి నదిలో వదులుతామని అటవీ అధికారి బీవీ సందీప్ తెలిపారు. ఈ చేపలకు అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉందని, అందుకే స్మగ్లింగ్ ముఠాలు అక్రమంగా వీటిని తరలించి సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారని అన్నారు.


పట్టుబడిన నిందితులు టిన్సుకియా జిల్లా గుయిజాన్ గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వ్యక్తుల నుంచి కిలో రూ.400 చొప్పున చేపలను కొనుగోలు చేశారు. ఈ చేపలను ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, జపాన్, మలేషియా, చైనాలకు అక్రమంగా తరలించాలని భావించారు. కాగా, అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు. ‘అసోం అటవీ అధికారులు విజయవంతంగా నిర్వహించిన యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో 500 చన్నా బార్కా చేపలను డిబ్రూఘర్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ అరుదైన జాతుల చేపల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.4.5 కోట్లు ఉంటుంది.. ఇటీవలి కాలంలో అరుదైన జలచరాల స్వాధీనంలో ఇది ఒకటి’ అని ఆయన ట్వీట్ చేశారు. దేశీయ మార్కెట్‌లో ఈ చేపల కిలో రూ.75 వేల నుంచి రూ.80 వేలు పలకడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa