ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వృద్ధి సహా వివిధ అంశాల్లో భారత్ను చైనాతో పోల్చుతూ చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ.. గట్టిగా బదులిచ్చారు. ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్ను పోల్చాలి గానీ.. పొరుగు దేశం చైనాతో కాదని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే చైనా ప్రజాస్వామ్య దేశం కాదని.. అక్కడ నియంతృత్వ పాలన కొనసాగుతోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా చైనాతో పదే పదే భారత్ను పోల్చడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే దేశానికి సంబంధించిన పలు కీలక విషయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.
భారత్కు పొరుగున ఉన్న చైనాలో ప్రజాస్వామ్యం లేదని.. ఆ దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక మన దేశంలో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న కొన్ని ఆందోళనలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొట్టి పారేశారు. ఆర్థిక వృద్ధికి సంబంధించి మాట్లాడేటప్పుడు భారత్ను చైనాతో పోల్చడం సరికాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ను చైనాతో కాకుండా వేరే ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మరింత బాగుంటుందని సూచించారు. మరోవైపు.. దేశంలో అవినీతి, నిరుద్యోగం వంటి అతి ముఖ్యమైన సవాళ్లు ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉండేది కాదని వెల్లడించారు.
ఇక ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత్కు చెందిన వ్యక్తులు సీఈవోతోపాటు పలు ఉన్నత హోదాల్లో కొనసాగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారత్లో నైపుణ్యాలకు కొరత లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని తెలిపారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుబడులకు అన్ని రకాల అనుకూల పరిస్థితులను కల్పిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. దేశంలో మైనార్టీలను అణిచివేస్తున్నారన్న విమర్శలపై స్పందించిన మోదీ.. విమర్శలు చేసేవారికి తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ఆ ఆరోపణలకు సమాధానం చెప్పి.. వాటిని ఖండించే హక్కు కూడా అవతలి పక్షానికి ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa