లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్కు అత్యంత సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత్ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడంతో మరోసారి వివాదం మొదలైంది. సంజయ్ ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే ఒలింపియన్ సాక్షి మలిక్ రెజ్లింగ్ను వదిలేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, బజ్రంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. తాజాగా, ప్రముఖ పారా రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం వీరికి మద్దతు తెలిపారు. తన ‘పద్మశ్రీ’ని కూడా వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘ఈ దేశ పుత్రిక, నా సోదరి కోసం నేను కూడా నా పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తాను.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ నా సోదరి సాక్షి మలిక్ను చూసి నేను గర్వపడుతున్నాను.. కానీ, దేశంలోని ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా దీనిపై (రెజ్లింగ్ వివాదాన్ని ఉద్దేశిస్తూ) తమ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నా’’ అని వీరేందర్ సింగ్ ట్వీట్ చేశారు. గూంగా పహల్వాన్గా గుర్తింపు పొందిన పారా రెజ్లర్ వీరేందర్కు 2021లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అదే ఏడాదది నవంబరులో అవార్డును అందుకున్న మర్నాడే పారా అథ్లెట్లకు న్యాయం చేయాలంటూ హరియాణా సీఎం ఇంటి ముందు అవార్డులతో ఆందోళనకు దిగి వార్తల్లో నిలిచారు.
సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ బజ్రంగ్ పూనియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం పార్లమెంట్కు వచ్చిన అతడు ప్రధానిని కలిసి అవార్డును తిరిగిచ్చేయాలని భావించారు. అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో.. కర్తవ్యపథ్కు చేరుకుని.. అవార్డుతో ప్రధానికి రాసిన లేఖను అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. దీనికి ముందు సాక్షి మలిక్ మీడియా సమావేశంలో తన బూట్లను బల్లపై పెట్టి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, ఈ పరిణామాలపై తొలిసారి హరియాణా ప్రభుత్వం స్పందించింది. హరియాణా ఉప-ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. ఉద్వేగభరిత నిర్ణయాలు తీసుకోవద్దని క్రీడాకారులను ఆయన కోరారు. ‘మన నిర్ణయాలు భావోద్వేగాలపై ఆధారపడకూడదు. రెజ్లింగ్ సమాఖ్యకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. కానీ, క్రీడాకారులు ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం సరికాదు’ అని చౌతాలా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa