శబరిగిరి అయ్యప్ప ఆలయంలో 40 రోజుల పాటు కొనసాగిన మండల పూజలు బుధవారం రాత్రి ముగిశాయి. దీంతో ఆలయాన్ని సంప్రదాయం ప్రకారం మూడు రోజుల పాటు మూసివేసి.. తిరిగి మకరవిలక్కు కోసం శనివారం తెరవనున్నారు. ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అంచనాలకు మించి భక్తుల రాకతో ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నవంబరు 17 నుంచి డిసెంబరు 27 వరకూ 40 రోజుల్లో దాదాపు 32 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
గతేడాది కంటే ఇది రూ.18.72 కోట్లు అధికం కావడం విశేషం. గతేడాది ఆదాయం మండల పూజల సీజన్లో హుండీ, ప్రసాదాల అమ్మకం సహా వివిధ రూపాలలో రూ. 222.98 కోట్లు వచ్చింది. తాజాగా, చివరి రోజు వసూళ్లతో పాటు విరాళంగా వచ్చిన నాణేల భారీ కుప్పను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఆదాయం మరింత పెరుగుతుందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ‘ఈ నాణేలు మాత్రమే దాదాపు రూ.6 కోట్లు ఉంటాయి.. నీలక్కల్ పార్కింగ్ ఫీజులు కలుపుకుంటే ఆదాయం మరింత పెరుగుతుంది’ అని ఆయన చెప్పారు.
కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా.. అరవన ప్రసాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వచ్చిందని తెలిపింది. అయితే కానుకల రూపంలో వచ్చిన ఆదాయం లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. అయితే లెక్కింపు ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇక అప్పం ప్రసాదం ద్వారా రూ. 12.38 కోట్లు వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు.
కుతకాలేలం (వివిధ సేవల వేలం) ద్వారా వచ్చిన ఆదాయం రూ.37.40 కోట్లుగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 30న ఆలయం తిరిగి తెరిచినప్పుడు రద్దీని నిర్వహించడానికి కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే. రాధాకృష్ణన్ వెల్లడించారు. శబరిపీఠం నుంచి సన్నిధానం వరకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల సేవలు 36 కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa