హిందుత్వ భావజాలం, హిందూ ధర్మంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. హిందుత్వ భావజాలం, హిందూ ధర్మం వేర్వేరని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు మైనారిటీ ఓట్లు చేజారకుండా.. మరోవైపు మితవాద హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నారని కర్ణాటక సీఎం మండిపడ్డారు. హిందుత్వలో సాఫ్ట్, హార్డ్ అంటూ ఏం ఉండవని ఆయన తెలిపారు. ‘హిందుత్వ అంటే హిందుత్వనే.. నేనూ హిందువునే.. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు.. మనం రాముడిని పూజించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడ్ని పూజిస్తున్నారా? గ్రామాల్లో రామాలయాలను మనం నిర్మించలేదా? మనం రాముడి భజనలు చేయలేదా? డిసెంబరు చివరి వారంలో భజనలు జరుగుతుంటాయి.. మా గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరిగేవి.. ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనేవాడ్ని.. కేవలం బీజేపీ వాళ్లే హిందువులా?.. మనం కాదా?’ అని సీఎం సిద్ధూ ప్రశ్నించారు.
కాగా, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేత సీఎన్ అశ్వత్ నారాయణ్ విరుచుకుపడ్డారు. సిద్దరామయ్య, కాంగ్రెస్కు ఎప్పుడూ భారత్ లేదా హిందుత్వానికి సంబంధించిన సమస్యలపై స్పష్టత లేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని, హిందూత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని అశ్వత్ నారాయణ్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ విభజన రాజకీయాలు చేస్తుంది.. దేశంలోని చట్టాన్ని గౌరవించలేదన్నారు. ఈ మతపరమైన అంశాలలోకి ఎందుకు ప్రవేశించాలి? హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు’ అని ఆయన ధ్వజమెత్తారు.
అయితే, సిద్ధరామయ్య ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్న సిద్ధ రామయ్య.. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. ‘నేను హిందూ మతానికి వ్యతిరేకం కాదు.. నేనూ హిందువునే, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకిని.. హత్యలను ఏ మతం సమర్ధించదు.. కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారు’ అని అన్నారు. అంతకు ముందు జనవరిలోనూ తాను అయోధ్యలోని రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు.మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు, వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో మరోసారి హిందుత్వపై సిద్ధరామయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 2019లో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి కారణమైన బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో ఆలయ నిర్మాణం అతి పెద్దది. రామ మందిరం, అయోధ్య మౌలిక సదుపాయాలు నిస్సందేహంగా 2024లో బీజేపీకి ఒక ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతుందని కాంగ్రెస్ సహా విపక్షాలకు తెలుసు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa