ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

international |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:20 PM

జపాన్‌లో కొత్త ఏడాది మొదటి రోజున భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్‌లో రిక్టర్ స్కేల్2పై సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. భూకంపంతో పశ్చిమ తీరానికి జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీచేసింది. జపాన్ వాతావరణ సంస్థ పశ్చిమ తీర ప్రాంతాలైన ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్లకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఇషికావా ప్రిఫెక్చర్‌లోని నోటోలో సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరం తీరంపై సునామీ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అలలు ఒక మీటరుకుపైగా ఎగిసిపడుతున్నాయని ఎన్‌హెచ్‌కే నివేదించింది. భూకంపం తర్వాత హోకురికు అణు విద్యుత్ కేంద్రంలో భద్రత, సమగ్రతను నిర్ధారించడానికి అధికారులు తనిఖీలను నిర్వహిస్తోంది. కాగా, 2011 మార్చిలో సంభవించిన భూకంపం కారణంగా పుకిషిమా దైచీలోని అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది. రియాక్టర్లు వేడెక్కి అణుధార్మికత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్లాంట్‌ను అతికష్టంతో మూసివేయాల్సి వచ్చింది.


కాగా, తాజా భూకంప వల్ల జరిగిన ప్రాణ,ఆస్తినష్టం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు అందలేదు. భూకంప కేంద్రం సహా మిగతా వివరాలపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, ఇండోనేషియాలో భూకంపం సంభవించిన 24 గంటల్లోనే ఈ భూకంపం చోటుచేసుకుంది. ఆదివారం ఇండోనేషియా పపువా ప్రావిన్సుల రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.


భూకంప కేంద్రంో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియాలోని వాతావరణ కేంద్రం జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపింది. కానీ, భూకంపం భూమిలో కేంద్రీకృతమై ఉన్నందున మరోసారి భూకంపం సంభవించే అవకాశం ఉందని జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరికలు చేసింది. హెచ్చరించినట్టుగానే మర్నాడు జపాన్‌లో భూకంపం సంభవించింది.


ఈ భూకంప సంఘటన మార్చి 11, 2011న ఈశాన్య జపాన్‌ను తాకిన వినాశకరమైన భూకంపం.. సునామీని గుర్తుచేస్తుంది. ఫుకుషిమాలో విస్తృతమైన విధ్వంసం, అణు విధ్వంసానికి దారితీసింది. ఆ విపత్తు చేదు జ్ఞాపకం ఇప్పటికీ చాలా మంది కళ్లముందు మెదలాడుతోంది. తక్షణ ప్రతిస్పందన ఆవశ్యకతను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. నివాసితులు అధికారిక మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని, అధికారులు జారీ చేసిన ఏవైనా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని సూచించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa